కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలని అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వరప్రసాద్ సూచించారు. ఆయన శుక్రవారం కర్నూలులోని ఎన్టీఆర్ నగర్లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. క్యాన్సర్ వ్యాఽధిపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అతిగా బరువు తగ్గడం, జ్వరం, అలసట, శరీరంలో మార్పులు, అసాధారణ రక్తస్రావం, మలమూత్ర విసర్జనలో మార్పులు, మానని పుండ్లు, రుతుక్రమంలో మార్పులు, రొమ్ములో గడ్డలు, జీర్ణ సంబంధమైన సమస్యలు, మింగడంలో ఇబ్బంది, పుట్టుమచ్చలలో మార్పులు, బొంగురు గొంతు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందికి తెలపాలని, ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ రక్తపోటు, మధుమేహం, రక్తహీనత పరీక్షలు, 30 ఏళ్లు దాటిన వారందరికీ రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను వైద్య సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి చేస్తారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధికి ముందస్తు పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని తెలిపారు. వైద్యాధికారి డాక్టర్ మౌనిక, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, నర్సులు జయమ్మ, సాయికుమార్, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు.


