ఈ ఏడాది కాల్వల అభివృద్ధికి ఎస్సార్బీసీ అధికారులు రూ.31.64 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులతో కాల్వల్లో పూడికతీత, దెబ్బతిన్న ప్రాంతాల్లో లైనింగ్ పనులు, ముళ్లపొదల తొలగింపు, కాల్వగట్లును బాగుచేయడం వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో కాల్వల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. కాల్వల మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో ప్రధాన కాల్వలు సైతం ముళ్ల పొదలతో దర్శనమిస్తున్నాయి. పదోబ్లాక్ కాల్వ బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల మండలాల పరిధిలో పలుచోట్ల లైనింగ్ దెబ్బతిని అధ్వానంగా ఉంది. సంబంధిత అధికారులు వచ్చే ఖరీఫ్ను దృష్టిలో ఉంచుకుని కాల్వలకు మరమ్మతులు చేపట్టి పంటలకు పుష్కలంగా సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.


