● కేసు నమోదు చేయని పోలీసులు
సాక్షి టాస్క్ఫోర్స్: అధికారం మనదైతే అన్యాయానికి, అక్రమాలకు, దాడులకు, దౌర్జన్యాలకు అడ్డేముందన్నట్టు డోన్ తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. రౌడీ షీటర్లను వెంటేసుకొని అమాయక యువకులపై దాడులకు దిగుతున్నారు. తాజాగా డోన్ తారకరామనగర్కు చెందిన గొల్ల సుధాకర్ అనే యునికుడిపై జరిగిన హత్యాయత్నమే ఇందుకు నిదర్శనం. బాధిత యువకుడు తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా లెక్క చేయకుండా తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పట్టణ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీసులు స్పందించకపోగా ఫిర్యాదు కూడా స్వీకరించలేదని కుటుంబ సభ్యుల ఆరోపణ. చివరకు సుధాకర్ను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ కూడా పలుకుబడి ఉపయోగించి దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు కాకుండా ప్రయత్నిస్తున్నారని బాధిత కుటుంబం వాపోతుంది. ఇదిలా ఉండగా తమకు గొల్ల సుధాకర్ నుంచి ఫిర్వాదు అందలేదని డోన్ పోలీసులు చెప్పడం గమనార్హం. తనపై హత్య చేసేందుకు ప్రయత్నించిన వారిలో ఎరుకలి పవన్ కుమార్ అనే వ్యక్తితో పాటు మరికొందరు రౌడీషీటర్లు ఉన్నారని, వెంటనే వారిని అరెస్టు చేయకపోతే తనను చంపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.
తగ్గిన ఉష్ణోగ్రతలు!
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉన్నాయి. పలు జిల్లాల్లో 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినప్పటికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అదుపులో ఉండటం ప్రజలకు ఊరటనిస్తోంది. నంద్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. సంజాలమలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దొర్నిపాడులో 42.9, పాణ్యంలో 42.6, కొత్తపల్లిలో 42.4, గోస్పాడు, ఆళ్లగడ్డ, రుద్రవరంలలో 42.2, గడివేములలో 42.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


