నంద్యాల(అర్బన్): జొన్నల కొనుగోళ్ల అనంతరం నంద్యాల పట్టణంలోని సీడబ్ల్యూసీ గోడౌన్లలో నిల్వచేసే క్రమంలో హమాలీల కొరత కారణంగా రైతులు పడిగాపులు కాయల్సిన పరిస్థితి తలెత్తింది. సుదూర ప్రాంతాల నుంచి జొన్నలను రైతులు వాహనాల తెచ్చారు. కొనుగోళ్ల అనంతరం గోడౌన్ల వద్ద కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున ఐదెకరాల పంట దిగుబడులు మాత్రమే కొనుగోలు చేసింది. మిగులు సరుకు దళారులకు అమ్మి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదే క్రమంలో గోడౌన్లో నిల్వచేసేందుకు రైతులకు రోజుల తరబడి పడిగాపులు తప్పడం లేదు. ఎలాంటి షరతులు లేకుండా 54 వేల ఎకరాల్లో పండిన జొన్న పంటను ప్రభుత్వం మద్దతు దరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
టీడీపీ నాయకులు
చెరువు మట్టిని కాజేస్తున్నారు!
కొలిమిగుండ్ల: హనుమంతుగుండం పెద్దచెరువు చెరువు మట్టిని టీడీపీ నాయకులు కాజేస్తున్నారని గ్రామస్తులు సత్తిగారి రామిరెడ్డి, సంజీవరాయుడు, సుంకన్న, వెంకటేశ్వరరెడ్డి బుధవారం ఆరోపించారు. అక్రమంగా తవ్వకాలు చేస్తూ పొరుగు జిల్లాకు ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలిస్తున్నారని మండిపడ్డారు. జెసీబీలు, పొక్లెయిన్లను ఏర్పాటు చేసి చెరువు మట్టి పోసేందుకు ప్రతి ట్రాక్టర్కు రూ.150, టిప్పర్కు రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. చుట్టు పక్కల గ్రామాల రైతులు స్వంతంగా జెసీబీలు ఏర్పాటు చేసుకొని మట్టి తరలించాలని భావిస్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. సాధారణ రైతులకు, స్థానికులకు అన్యాయం జరగుతోందన్నారు. రెండు నెలల నుంచి మట్టి తవ్వకాలు చేపట్టడంతో చెరువు సహజ స్వరూపం దెబ్బతినే ప్రమాదముందన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


