బేతంచెర్ల: పాణ్యం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తి బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె గ్రామం సమీపంలోని మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొత్తూరు గ్రామానికి చెందిన బీరం వెంకట సుబ్బారెడ్డి (56) బేతంచెర్ల పట్టణంలో బంధువుల శుభకార్యానికి వచ్చి తిరిగి బుగ్గానిపల్లె గ్రామంలో జరిగే సుంకులమ్మ జాతరకు బైక్పై వెళ్లాడు. అక్కడ సుంకులమ్మ జాతర చూసుకొని కందికాయపల్లె మీదుగా సొంత గ్రామానికి వెళ్తుండగా బుగ్గానిపల్లె సమీపంలో మలుపు వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కనున్న రాళ్లల్లో పడిపోయాడు. తలకు, కాలికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


