హొళగుంద: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కించగా రూ.4.50 లక్షలు వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వీరనాగప్ప, వైస్ చైర్మన్ లోక్యానాయక్ తెలిపారు. మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు, నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామ పెద్దల ఆధ్వర్యంలో హుండీల్లోని కానుకల లెక్కింపు జరిగింది. గత ఐదున్నర నెలల కాలంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించినట్లు చైర్మన్ చెప్పారు. వచ్చిన ఆదాయాన్ని నెలవారి ఆలయ ఖర్చులు, అమావాస్య, ఆదివారాలలో అన్నదానం, ఇతర ఖర్చులకు వెచ్చించి, మిగతా మొత్తాన్ని అభివృద్ధి పనులకు వినియోగిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. లెక్కింపు సందర్భంగా ఎస్ఐ దిలీప్కుమార్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మి రామ్నాయక్, కానిస్టేబుల్ రాజగోపాల్ బందోబస్తు చేపట్టారు.


