● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను భారీ స్థాయిలో చేపట్టేందుకు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముందుగా అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి చేరికలను పెంచడం ప్రధాన లక్ష్యంగా మంగళవారం అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల్లో, మున్సిపల్ ప్రత్యేక అధికారులు ఆయా మున్సిపాలిటీల్లో, ఆర్డీవోలు తమ నియోజకవర్గ పరిధిలో ప్రత్యక్షంగా పర్యటించి విద్యార్థుల చేరికల పురోగతిని సమీక్షించాలన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న దాదాపు 10 వేల మంది పిల్లలు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 6,500 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరారన్నారు. మిగిలిన పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను సీజ్ చేయడంతో పాటు, అక్రమ అనుమతులు మంజూరు చేసినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.


