ఆలూరు రూరల్: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన డిగ్రీ విద్యార్థి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో ఈ విషాద ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని మనేకుర్తి గ్రామానికి చెందిన శివమ్మ, వీరేష్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. రెండో కుమారుడు ఉపేంద్ర (18) సోమవారం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న నీటి కుంటలో ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో కుంటలో మునిగి మృతిచెందాడు. స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించడంతో నీటి కుంటలో దిగి ఉపేంద్ర మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు ఆలూరు ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


