● ట్రాక్టర్ మట్టి రూ.1,120 చొప్పున
అమ్మకం
● టీడీపీ నాయకుల బరి తెగింపు
నంద్యాల: టీడీపీ నాయకుల బరితెగింపునకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ధనార్జనేధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. డబ్బుల కోసం దేవుడి భూములను కూడా వదలడం లేదు. గోస్పాడు మండలం జూనేపల్లె గ్రామంలో శివాలయం నిర్వహణ కోసం దాతలు ఇచ్చిన భూమిలో యథేచ్ఛగా మట్టి తవ్వి అమ్మేస్తున్నారు. ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు పెట్టి భూమిని తవ్వి ట్రాక్టర్ మట్టి రూ.1,120 చొప్పున అమ్మేస్తున్నారు.
ప్రొక్లెయిన్లతో మట్టిని తవ్వేస్తూ..
నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జూలేపల్లె గ్రామంలో శివాలయం నిర్వహణ కోసం దాతలు 23 ఎకరాలు ఇచ్చారు. అనాదిగా ఈ భూములకు వేలం పాటలు వేస్తూ వచ్చిన డబ్బులతో ఆలయ నిర్వహణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 23 ఎకరాల్లోని 7.50 ఎకరాల్లో ఉన్న మట్టిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఈ భూమిలోనే మట్టిని అమ్మేస్తే రూ.లక్షల్లో సంపాదించుకోవచ్చని ఆలోచించారు. దేవుడి మాన్యం అని కూడా చూడకుండా వెంటనే పదుల సంఖ్యల్లో ట్రాక్టర్లు ఎక్కి ప్రొక్లెయిన్లతో మట్టిని తవ్వేస్తున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.1,120 చొప్పున అమ్మేస్తున్నారు. గ్రామస్తులు అడిగితే గ్రామ, దేవాలయ అభివృద్ధి కోసం మట్టిని అమ్ముతున్నామని చెబుతున్నారు. దేవస్థానం అధికారులు మట్టిని అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారని చెప్పి మరీ మట్టిని తవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాతలు శివాలయం అభివృద్ధి చెందాలని ఆలయ నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని భూమి ఇస్తే ఆ భూమిని తవ్వి డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన టీడీపీ నాయకులకు రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూలేపల్లె గ్రామంలో మట్టిని తవ్వుతున్నారన్న విషయం మాకు తెలియదు. ఓ ట్రాక్టర్ మట్టి అమ్మినా చర్యలు తీసుకుంటామని అక్కడ అర్చకుడికి తెలియజేశాం. దేవస్థానం భూమిని తవ్వి మట్టిని అమ్ముకోవడానికి మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దేవస్థానం అధికారుల పేరు చెప్పి మట్టిని అమ్ముకుంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – మోహన్, దేవదాయ శాఖ
అసిస్టెంట్ కమిషనర్, నంద్యాల


