ఆరోగ్యశ్రీ బంద్‌ కొనసాగింపు | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ బంద్‌ కొనసాగింపు

Apr 3 2026 8:02 AM | Updated on Apr 3 2026 8:02 AM

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలోని ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఎన్‌టిఆర్‌ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) సేవల బంద్‌ కొనసాగుతోంది. బకాయిల వసూలుకు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ నెల ఒకటో తేది నుంచి సమ్మె చేస్తున్నాయి. గురువారం సైతం మెజారిటీ ఆసుపత్రులు బంద్‌ పాటించాయి. జిల్లా మొత్తం 60 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉండగా గురువారం సైతం సగానికి పైగా ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఆయా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ అని బోర్డు ఏర్పాటు చేశారు. వైద్యసేవ సేవలు కొనసాగిస్తున్న ఆసుపత్రుల్లోనూ కొన్నింటిలో అత్యవసర కేసులు మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో అక్కడి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్న ఆసుపత్రులకు రోగులు వెళ్లాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో హైకోర్టు సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని ఆసుపత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి.

ఆర్‌ఆర్‌బీ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపు

కర్నూలు(అర్బన్‌): ఆర్‌ఆర్‌బీ గ్రూపు–డీ పోస్టుల ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేది వరకు పొడిగించినట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కె.ప్రసూన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎస్‌ఎస్‌సీలో అర్హత సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్‌టీ అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారంను కల్లూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో నేరుగా వచ్చి అందించాలన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో ఉచిత శిక్షణ 60 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. శిక్షణ కాలంలో స్టడీ మెటీరియల్‌ అందిస్తామని, శిక్షణ పూర్తయిన అనంతరం అర్హులైన వారికి స్టైఫండ్‌ మంజూరవుతుందన్నారు. వివరాలకు 08518 – 236076, 9652093661 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

వేరుశనగ ధర పతనం

కర్నూలు(అగ్రికల్చర్‌): వేరుశనగ ధర పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గురువారం కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ–నామ్‌ వర్షన్‌ మారడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ–నామ్‌ సెకండ్‌ వర్షన్‌తో అనేక సమస్యలు ఏర్పడటంతో వ్యవసాయ ఉత్పత్తులను గతంలో ఉన్న పాత పద్ధతి ద్వారా(మాన్యువల్‌) క్రయవిక్రయాలు చేపట్టారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి వేరుశనగ ధరను అడ్డంగా కోసేశారు. ఇటీవల క్వింటా ధర రూ.12,500 వరకు వెళ్లిన వేరుశనగ ధర నేడు నేల ను తాకింది. మార్కెట్‌కు 2260 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. కనిష్ట ధర రూ.3,412, గరిష్ట ధర రూ.7909 లభించగా.. సగటు ధర రూ.6,077 నమోదైంది.

● కందులకు కనిష్ట ధర రూ.2,690, గరిష్ట ధర రూ.7,709 లభించగా.. సగటు ధర రూ.7,070 మాత్రమే పలికింది.

● శనగలకు కనిష్ట ధర రూ.3,069 లభించగా.. గరిష్ట ధర రూ.5290 పలికింది. సగటు ధర రూ.4759 నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement