శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం ఉగాది ఉత్సవాలను అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలనతో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి డాక్టర్ బుట్టే వీరభద్ర దైవజ్ఞ ఉగాది పంచాగాన్ని పఠించారు. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వానికి ఎదురయ్యే పరిస్థితులు, సమాజానికి సంబంధించిన శుభాశుభ ఫలితాలను విశదీకరిస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శ్రీశైల దేవస్థానానికి 29 సంవత్సరాలుగా సేవలందిస్తున్న పంచాంగ శ్రవణకర్త డాక్టర్ బుట్టే వీరభద్రను శాలువాతో సత్కరించారు. అలాగే శ్రీశైల దేవస్థాన ప్రధాన అర్చకులు శివప్రసాద్ స్వామి, అమ్మవారి అర్చకులు విజయ్స్వామిని సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంద్యాల జిల్లాకు చెందిన ముగ్గురు అర్చకులు మఠం శివశంకరయ్య, ఇటిక్యాల వెంకటసుబ్బయ్య, ఎం.త్రివేణికుమార్, పండితుడు ఎం.మహేశ్వరయ్యను ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.10,116 నగదు పురష్కారంతో పాటు సంప్రదాయ దుస్తులైన పంచా, కండువా, శాలువా అందించి సన్మానం చేశారు.


