శేష వాహనంపై అహోబిలేశుడు
● వైభవంగా అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలానృసింహస్వామి శేషవాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నృసింహ స్వామిఅమ్మవార్లకు నిత్య పూజల్లో భాగంగా తెల్లవారుజామున మేలుకొలుపు చేసి వేద మంత్రోచ్ఛారణలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. విశేష పుష్పాలంకరణ అనంతరం శేష వాహనంపై ఉభయ దేవేరులతో శ్రీ జ్వాలా శ్రీ జ్వాలానృసింహస్వామి కొలువుదీరారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలతో మాడవీధుల్లో వివహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉత్సవమూర్తులకు మధ్యాహ్నం పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.
దిగువ అహోబిలంలో..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి శ్రీ యోగానృసింహ గరుడ విమానంపై దర్శనం ఇచ్చారు. భక్తజనం మధ్య మాడవీధుల్లో విహరించారు. అంతకు ముందు వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాత సేవ అనంతరం మూలమూర్తులను మేలుకొలిపి శ్రీఘ్రదర్శనం అనంతరం అర్చనలు నిర్వహించారు. ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను యాగశాలలో కొలువుంచి నవకళశస్థాపన చేశారు. జలాభిషేకం నిర్వహించి నూతన పట్టువస్త్రాలు, వజ్ర, వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా ముస్తాబైన ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో శ్రీ యోగనృసింహ గారుడ విమానం వాహనం అధిరోహించారు. మంగళవాయిద్యాలతో వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మాడ వీధుల్లో వైభవోపేతంగా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి హనుమంతు వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.
నేటి ఉత్సవాలు..
ఎగువ అహోబిలంలో గురువారం ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహన సేవ నిర్వహిస్తారు. దిగువ అహోబిలంలో ఉదయం శేషవాహన సేవ, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు జరగనున్నాయి.
శేషవాహనంపై..
శేష వాహనంపై అహోబిలేశుడు


