రూ.50 లక్షల గోల్మాల్!
● టీడీపీ కాంట్రాక్టర్ల తీరుపై
ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్పర్సన్
బొమ్మలసత్రం: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిల్లర ఖర్చుల పేరుతో ఆ పార్టీకి చెందిన కొందరు కాంట్రాక్టర్లు రూ.50 లక్షలు గోల్మాల్కు పాల్పడటం కౌన్సిల్ను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై కౌన్సిలర్లు , చైర్పర్సన్ మాబున్నిసా తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. మున్సిపాల్టీ అధికారులు తీరు మార్చుకోవాలని ౖచైర్పర్సన్ దృష్టికి సీ బిల్లుల విషయాన్ని కౌన్సిలర్ ఆరిఫ్నాయక్ తీసుకెళ్లారు. ఇదే విషయంపై ఎంఈ గుర్రప్పయాదవ్ను కౌన్సిలర్లు నిలదీశారు. చిన్నాచితక పనులకు రూ. 50 లక్షల బిల్లులు ఎలా మంజూరు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చైర్పర్సన్ మాబున్నిసా మాట్లాడుతూ.. అంత సొమ్ము ఖర్చుచేస్తే మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకురాకుండా ఉండటం నిర్లక్ష్యమేనన్నారు. సీ బిల్లుల చెల్లింపుల్లో ఇంత వరకు జరిగిన లెక్కల వివరాలు తమకు తెలియజేయాలని సూచించారు.
రూ. 20 లక్షల పనులకు
ఒకే ఒక్క టెండర్!
మున్సిపల్ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన పొందుపరిచిన 34, 35 అంశాలను కౌన్సిలర్ కృష్ణమోహన్తో పాటు మరి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. షాదిక్ నగర్లో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ అధికారులు టెండర్లకు పిలవగా టీడీపీ నాయకుడు సుధాకర్ అనే కాంట్రాక్టర్ మాత్రమే 0.60 శాతం తక్కువ మొత్తంతో టెండర్ దాఖలు చేయడంపై కౌన్సిలర్లు అభ్యంతరకరం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ఇదే కాంట్రాక్టర్ మున్సిపాల్టీలో కౌన్సిల్ దృష్టకి రాని చిన్నాచితక పనులకు రూ. 15 లక్షల దాకా సీ బిల్లులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక పార్క్లో కేవలం చెత్త బుట్టలు ఏర్పాటు చేసేందుకు రూ. 1.74 లక్షలు ఖర్చు చేయటం చూస్తే ప్రజల సొమ్ము ఇంత ఈజీగా దోచుకుంటున్నారా అన్న అనుమానం ప్రతి ఒక్కరికీ రాకమానదు.
దళిత సంఘం నేతల ఆందోళన
మున్సిపల్ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటంలో అధికారులు విఫలమయ్యారని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కౌన్సిల్హాల్లో సమావేశం జరుగుతుండగా దళిత సంఘం నేతలు చైర్పర్సన్ పోడియం వద్దకు వెళ్లారు. అనంతరం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కోలా కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈఏడాది ఏప్రిల్ నెలలో అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన పనులకు మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ శంకుస్థాపన చేశారన్నారు. సాక్షాత్తు మంత్రి శంకుస్థాపన చేసినా పనులను అధికారులు నిర్లక్ష్యం చేయటం దారుణమన్నారు. చైర్పర్సన్ మాబున్నిసా స్పందిస్తూ .. అధికారులు తక్షణమే అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
రూ.50 లక్షల గోల్మాల్!


