
చంద్రన్న బీమా..లేదు ధీమా
● 17 నెలల్లో ఉమ్మడి జిల్లాలో
2,446 మంది మృతి
● వీరిలో ప్రమాద మృతులు 151 మంది
● ఇచ్చిన హామీ మేరకు
ప్రమాద మరణాలకు రూ.10 లక్షలు..
సాధారణ మరణాలకు
రూ.5 లక్షలు ఇవ్వాలి
● ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికీ
దక్కని భరోసా
● గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమాతో
పేదలకు ఎంతో మేలు
● అప్పట్లో క్రమం తప్పకుండా
సాయం అందజేత
ఈ చిత్రంలో కనిపించే మహిళ పేరు చాంద్బేగం. తుగ్గలి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన ఈమె భర్త కాశీంవలి(50) ఆరు నెలల క్రితం అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇంటికి ఆధారమైన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. నిబంధనల మేరకు ఈ కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందాలి. బాధితురాలికి వితంతు పింఛన్ ఇవ్వాలి. అయితే ఇవేమీ అందలేదు. ఈమె పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.
గుంతలు పడిన రోడ్లు.. వేగంగా దూసుకొచ్చే వాహనాలు.. వణికిస్తున్న డెంగీ జ్వరాలు.. అకస్మాత్తుగా లయతప్పుతున్న గుండెలు.. ప్రజల పరిస్థితి దినదిన గండంగా మారింది. ఎప్పుడు ప్రమాదం
సంభవిస్తుందో, ప్రబలుతున్న రోగాలతో ప్రాణం ఉంటుందో లేదో తెలియని దుస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు ‘చంద్రన్న బీమా’ భరోసా ఇవ్వలేకపోతోంది. కుటుంబ పెద్ద అకాల మృతితో ఇంటిళ్లిపాది రోడ్డున పడాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అయినా ఈ పథకం కింద కనీసం దరఖాస్తులు స్వీకరించలేని దౌర్భాగ్యం నెలకొంది.
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు చరమగీతం పాడి పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లల్లో సంక్షోభాన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్న వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చి అమలు చేయకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. చంద్రన్న బీమా పథకం కింద సహజ మృతికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మృతి చెందితే రూ.10 లక్షలు అందచేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన, బీజేపీ నేతలు కూడా చెప్పారు. అయితే మృతి చెందిన కుటుంబాల నుంచి ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరించేందుకు మార్గదర్శకాలను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. బీమా ఆర్థిక సాయం అందక బాధితులు కన్నీటితో ‘అంతా మాయ చేశారు’ అని ఆరోపిస్తున్నారు.
వేనవేల వేదనలు!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12న ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటై 17 నెల నడుస్తున్నా చంద్రన్న బీమా హామీ అమలుపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. సాధారణంగా 18 నుంచి 50 ఏళ్లు వారు మృతి చెందితే, అలాగే ప్రమాదాల్లో 18 నుంచి 70 ఏళ్ల లోపు వారు మృతి చెందితే ఈ పథకానికి అర్హులు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 1,256 మంది, నంద్యాల జిల్లాలో 1,190 మంది సాధారణంగా మృతి చెందారు. ప్రమాదాల్లో కర్నూలు జిల్లాలో 72, నంద్యాల 79 మంది మృతి చెందారు. కుటుంబానికి ఆధారమైన వారిని పోగొట్టుకున్న ఎన్నో కుటుంబాలు చంద్రన్న బీమా పథకం కింద పరిహారం వస్తుందనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల మృతులను పట్టించుకోలేదు. ఇంటికి ఆధారమైన వారిని పోగొట్టుకొని, ప్రభుత్వం నుంచి చేయూత కరువై వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి.
అప్పటి పరిస్థితులు పునరావృతం
టీడీపీ పాలనలో 2014 నుంచి 2019 వరకు వేలాది మంది మృతి చెందినప్పటికీ చంద్రన్న బీమా ఉన్న వారికి పరిహారం రాలేదు. బీమా ఉన్న వారు మృతి చెందితే వారి వారసులు పరిహారం పొందాలంటే ఏళ్లుగడిచేవి. బాధిత కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో బాధిత కుటుంబాల్లో 20 శాతం మంది కూడా బీమా దక్కలేదు. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు దోహదపడే చంద్రన్న బీమా అమలును పూర్తిగా పక్కన పెట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12.38 రైస్కార్డులు ఉండగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం 10.25 లక్షల కటుంబాలకు వైఎస్సార్ బీమా కల్పించింది. కూటమి ప్రభుత్వం మాత్రం చంద్రన్న బీమాను ఇంతవరకు పట్టించుకోలేదు.
వెబ్ సైట్ను మూసివేసి
చంద్రన్న బీమా పథకాన్ని డీఆర్డీఏ అమలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడమే మొదలు సాధారణ, ప్రమాద మృతుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ను పూర్తిగా మూసి వేశారు. నిబందనల ప్రకారం బీమా ఉన్న వ్యక్తి మృతి చెందితే 24 గంటల్లో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంది. మృతుల కుటుంబాలు దుర్భర జీవితం గడుపుతున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు.
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
గత వైఎస్సార్సీపీ హయాంలో పేద బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో 18 నుంచి 50 ఏళ్లలోపు వారు, 50 నుంచి 60 ఏళ్లలోపు వారు మృతిచెందితే రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు బీమా సొమ్ము మంజూరయ్యేది. మృతి చెందిన వెంటనే వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది మృతుడి ఇంటికి వెళ్లి అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా రూ.10 వేలు అందించేవారు. మిగతా సొమ్ము 15 నుంచి 20 రోజుల్లో నామిని బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది. బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు అర్హులు కావడంతో ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు సహకరించకపోయినా పూర్తిగా ఈ పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అమలు చేసింది. రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకం అమలు అయ్యింది.
ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే..
సామాన్య, మధ్య తరగతి ప్రజలు మృతి చెందినా ప్రస్తుతప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రం పెద్దపీట వేసింది. కోటి మందికిపైగా టీడీపీ సభ్యత్వం కల్పించింది. వారికి రూ.5 లక్షలతో టీడీపీ తరఫున ప్రమాద బీమా కూడా కల్పించింది. టీడీపీ కార్యకర్తలకు ఇచ్చిన విలువ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఇవ్వకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తమకు పార్టీ కార్యకర్తలే ముఖ్యం.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కాదని టీడీపీ నిరూపించుకున్నట్లు అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

చంద్రన్న బీమా..లేదు ధీమా