
శ్రీశైలానికి మొండి చేయి చూపారు!
శ్రీశైలంప్రాజెక్ట్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శ్రీశైలంలో పర్యటించడంతో నిధులు వరదలా వస్తాయని ఆశించామని, అయితే శ్రీశైలానికి మొండి చేయి చూపించారని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్లోని ఏపీజెన్కో అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. శ్రీశైలంలో ప్రధాని పర్యటన అనగానే అభివృద్ధికి మహర్దశ పడుతుందని భావించామన్నారు. అయితే శ్రీశైలం పర్యటనలో ప్రధాని మోదీ నోట అభివృద్ధి మాట రాకపోవడంతో నిరాశకు గురయ్యామన్నారు. నిధులు రాబట్టడంలో టీడీపీ నేతలు విఫలం అయ్యారని, అలాగే శ్రీశైల ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారానికి హామీ కూడా పొందలేకపోయారన్నారు. ప్రశ్నిస్తాననే రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నోరు మొదపలేదన్నారు. గతంలో కేంద్ర మంత్రి అమితాషా శ్రీశైలం పర్యటనకు రాగా.. తాము శ్రీశైలం అభివృద్ధి, రైల్వేలైన్, దోర్నాల నుంచి శ్రీశైలం, ఆత్మకూరు రోడ్ల విస్తరణ, దోర్నాల నుంచి శ్రీశైలం ఎలివేషన్ కారిడార్, శ్రీశైలం–సున్నిపెంట స్ప్రింగ్బ్రిడ్జ్ తదితర ప్రతిపాదనలు తీసుకువచ్చామన్నారు. ప్రధాని మోదీ శ్రీశైలానికి వస్తే బీజేపీ మండల నాయకుడు చదువుల శ్రీనుకు అపాయింట్మెంట్ ఇచ్చి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి ఇవ్వకపోవడం చూస్తుంటే ఆయన స్థాయి ఎంతకు దిగజారిందో అర్ధమవుతోందన్నారు. ట్రస్ట్బోర్డ్ సభ్యుల నియామకంలో బుడ్డా ప్రాధాన్యత ఏమిటో తెలిసిపోయిందన్నారు. ప్రమాణ స్వీకారానికి ఆయనకు ఆహ్వానం లేకపోవడం చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఎన్ని మార్కులు ఉన్నాయో ప్రజలకు అర్ధమవుతోందన్నారు. శ్రీశైలం అభివృద్ధి కోసం కాకుండా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తన అనుచరుల కోసం పనిచేస్తున్నారని శిల్పా ఆరోపించారు. ఇసుక, ఇటుక, మద్యం దుకాణాలు, బెల్ట్షాపులు, దేవస్థానంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలు, సున్నిపెంటలో భూముల కబ్జాలపైన ప్రతిరోజు తీరిక లేకుండా ఉన్నారని విమర్శించారు. ‘దేవస్థానానికి స్వయంగా నేను కాటేజీ కట్టిస్తున్నానని, ఇందుకు ఇసుక లారీలను పంపిస్తే వాటిని బుడ్డా తన అనుచరుల చేత ఆపిస్తున్నారని, కప్పం కట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని, వసూల్ కింగ్గా మారారేమో’ అని శిల్పా అన్నారు. సున్నిపెంటలో వైఎస్సార్సీపీ నాయకుడు వట్టి వెంకటరెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఎమ్మెల్యే చూస్తున్నారని, డిజిటల్ బుక్లో నోట్ చేసుకుని, అధికారంలోకి వచ్చాక వదిలి పెట్టబోమని హెచ్చరించారు. శ్రీశైలంలో అభివృద్ధి పేరిట శివాసదనం, పెద్ద సత్రంలను పడగొట్టినప్పటికీ అక్కడి నివాసితులకు శ్రీశైలంలోనే నివాసాలను కల్పించాలని శిల్పా డిమాండ్ చేశారు.
అభివృద్ధిపై ఒక్క మాట కూడా
మాట్లాడలేదు
నిధులు రాబట్టడంలో
టీడీపీ నేతలు విఫలం
మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి