
అంకితభావం వాగు దాటించింది!
కోవెలకుంట్ల: కోవెలకుంట్లతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మండల పరిధిలోని కంపమల్ల సమీపంలో బుచ్చమ్మ కుంట గురువారం ఉప్పొంగి ప్రవహించింది. గ్రామానికి వెళ్లే ఆర్అండ్బీ రహదారిపై వరదనీరు పోటెత్తింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మూర్తి, గిరీష్కుమార్ పాఠశాలకు బయలుదేరే క్రమంలో వరద అడ్డగించి రాకపోకలు స్తంభించిపోయాయి. ఎలాగైనా పాఠశాలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును సాహసం చేశారు. ఒకరికొకరు తోడుగా వాగు దాటుకుని పాఠశాలకు చేరుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును సైతం లెక్క చేయకుండా విధులకు హాజరైన ఉపాధ్యాయులను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.
బైరెడ్డి ఆధ్వర్యంలో నేడు చలో మెడికల్ కాలేజీ
బొమ్మలసత్రం: జిల్లా కేంద్రంలోని నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వాహణకు సంబంధించి వాస్తవ పరిస్థితితులను ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్యాదవ్ గురువారం తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి విభాగం, యువకులతో కలిసి శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకుంటామన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో కలిగే నష్టాలను బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రజలకు వివరిస్తారని తెలిపారు.
నాగంపల్లి సొసైటీ సీఈఓపై కేసు నమోదు
కొత్తపల్లి: మండల కేంద్రంలోని నాగంపల్లి సొసైటీ సీఈఓ కోటేశ్వరయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయశేఖర్ గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. 2022 నుంచి నాగంపల్లి సొసైటీలో కోటేశ్వరయ్య సీఈఓగా విధులు నిర్వహిస్తూ రుణాలు తీసుకున్న రైతులు చెల్లింపు సమయంలో నకిలీ రసీదులు ఇచ్చి తప్పుదోవ పట్టించారు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూన్ నెలలో సహకార సొసైటీ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. రూ. 42.40, లక్షల మేర అవినీతికి పాల్పడినట్లు గుర్తించి విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ప్రస్తుత నాగంపల్లి సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ఫిర్యాదు మేరకు కోటేశ్వరయ్యపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ ఆదాయం రూ.3,46,96,431 లభించినట్లు శ్రీశైల దేవస్థాన అధికారులు తెలిపారు. గురువారం చంద్రావతి కల్యాణ మండపంలో పకడ్బందీగా హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ ఆదాయాన్ని గత 29 రోజులులో స్వామి అమ్మవార్లకు భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 131.300 గ్రాములు బంగారం, 5.50 కేజీలు వెండి లభించాయి. అలాగే 2,321 యూఎస్ఏ డాలర్లు, 84 యూఏఈ దిర్హమ్స్, కత్తార్ రియాల్స్ 567, మలేషియా రింగ్ ఇట్స్ 57, యూకే పౌండ్స్ 165, కాంగో ఫ్రాంకులు 2000, కెనడా డాలర్లు 20, ఆస్ట్రేలియా డాలర్లు 15, ఈరోస్ 30, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. సీసీ కెమెరాల నిఘా లో పకడ్బందీగా హుండీ లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రమణమ్మ, టెంపుల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

అంకితభావం వాగు దాటించింది!