
భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి
నంద్యాల: జిల్లాలో వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, డీఆర్ఓ, ఆర్డీఓ లు, సంబంధిత మండల తహసీల్దార్లు, తదితర అధికారులు కలెక్టర్ ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణలో భూసేకరణ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయి లో రైతులు, అసైన్దారులతో సమన్వయం చేసు కొని స్పష్టమైన నివేదికలు పంపాలని జాయింట్ కలెక్టర్, సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో కుసుం ప్రాజెక్టు కోసం మిడ్తూరులో 162 ఎకరాలు, కంప్రెష్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టుల కోసం రుద్రవరం, చాగలమరి, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో కలిపి 315 ఎకరాలు కేటాయించామన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం డోన్, బేతంచర్లలో 2,860 ఎకరాలు, ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కోసం సుగాలిమెట్ట లో 49 ఎకరాలను కేటాయించామన్నారు. జిల్లాలో భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించి, పెట్టుబడులు, పరిశ్రమలు సజావుగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధి కారి రాము నాయక్, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు విశ్వనాథ్, నరసింహులు, నాగజ్యోతి, తహసీల్దార్లు పాల్గొన్నారు.