
సర్వం మార్చి.. మంగళం పాడి
నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగు మాధ్యమానికి తూట్లు పొడుస్తోందని గత ఐదేళ్లగా అక్కసు వెళ్లగక్కిన కూట మి నాయకులు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు మాధ్యమానికి మంగళం పాడేయాలని నిర్ణ యించారు. రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేదంటూ విద్యాశాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కలిపి 1,490 ఉండగా అందులో 1,50,155 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్మీడియెట్లో సైతం ఇన్నాళ్లు తప్పనిసరిగా ఉన్న తెలుగు సబ్జెక్టును ఐచ్ఛికం చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి తెలుగు అధ్యాపకులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో తెలుగు మాధ్యమానికి అన్యాయం చేస్తున్నారని, తెలుగులోనే బోధన, చదువులు కొనసాగాలని గగ్గోలు పెట్టిన కూటమి పార్టీల పెద్దలు, నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక తమ స్వరం మార్చుకుంటున్నారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ తెలుగుమాధ్యమం లేదంటూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల తెలుగుభాషాభిమానులు, ఏపీ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లాశాఖ ప్రతినిధులు మండిపడుతున్నారు.
నాడు తెలుగుకు అన్యాయం జరగకుండా...
తెలుగు సబ్జెక్టుకు అన్యాయం జరగకుండా.. తెలుగును సబ్జెక్టును తప్పనిసరి చేస్తూనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంగ్లిషు మీడియంను తీసుకోచ్చింది. పేద, మధ్య తరగతి పిల్లలు పోటీ ప్రపంచంతో పోటీపడి రాణించాలని ఆనాడు ఇంగ్లిషు మీడియంలో చదువు, సీబీఎస్సీ సిలబస్ అమలు విషయంలో ఎవరెన్ని చెప్పినా ఆనాటి గత సర్కారు వెనక్కి తగ్గలేదు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఐఐటీ, ఎంబీబీఎస్ వంటీ కోర్పులను కూడా తెలుగు మాధ్యమంలో బోధించాలని పేర్కొంటే ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం పాఠశాలల్లో ఆ నిబంధనలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
పునర్వ్యవస్థీకరణలో తీవ్ర అన్యాయం..
పాఠశాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1 నుంచి 8 తరగతులు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను తీసే యడం తీవ్ర అన్యాయమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులు మండిపడుతున్నాడు. 8వ తరగతి తర్వాత రాబోయే పదో తరగతిలో తెలుగు ఉత్తీర్ణత ప్రభావితం కానుందని గుర్తుచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీ నాయకులు మాటలు, ప్రకటనలు విని నిలువునా మోస పోయామని తెలుగు భాషాభిమానులు, తెలుగు ఉపాధ్యాయులు, లెక్చరర్లు తమ అక్రోశం వెల్లగక్కుతున్నారు.
దురుద్దేశం తేటతెల్లం..
ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు టీచర్లు ఉండరా..? అంటే అవుననే సమాధానం పాఠశాల విద్యా శాఖ చెబుతోంది. ఈ మేరకు పునర్వ్యవస్థీకరణ జీవో లో ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు బోధకులు పాఠశాలలకు కేటాయించకుండా మార్గదర్శకాలను వెలువరించింది. 2001లో విస్తతంగా ప్రాథమికోన్నత పాఠశాలలు నెలకొల్పినప్పుడు ఏర్పాటైన స్టాఫ్ ప్యాటర్న్ను 2025 వరకు కొనసాగించడం ద్వారా మెరుగైన విద్యా ప్రమాణాలు సాధ్యమయ్యాయి. తాజాగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు పోస్టులను ఎత్తివేయడం వారి దురుద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల తెలుగు బోధనను ఎవరు చేపడతారో ప్రశ్నార్థకంగా మారిందని భాషాభిమాను లు, రాష్ట్ర భాషోపాధ్యా సంస్థ జిల్లాశాఖ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..
● తెలుగుభాష పట్ల గౌరవం ఉంటే తక్షణం పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలి.
● విద్యార్థుల రేషియో ఆధారంగా బడుల్లో తెలుగు ఉపాధ్యాయులను నియమించాలి.
● తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి, ఉద్యోగాలు పొందేందుకు 2 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
● ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ కళాశాల స్థాయి వరకు తెలుగు మాధ్యమంలో విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలి.
తీవ్ర అన్యాయం
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమానికి పాతరేసేలా కూటమి ప్రభుత్వం దుందుడుకు చర్యలు చేపడుతోంది. విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్య మం లేదంటూ పేర్కొనడం విచారకరం. కూటమి ప్రభుత్వం ఆనాడు చేసిన ప్రకటనలకు ప్రస్తుతం పూర్తి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం తగదు.
– కన్నయ్య, రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం
జిల్లా అధ్యక్షుడు, నంద్యాల
తెలుగుకు వెలుగేదీ?
నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూటమి పార్టీల పెద్దలు, నాయకులు, అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లిషుమీడియం, సీబీఎస్సీ సిలబస్ పట్ల అనరాని మాటలు అన్నారు. ఆ వాఖ్యలు, ప్రకటనలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. తీరా అధికారంలోకి వచ్చాక తెలుగు మాధ్యమాన్ని అధఃపాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేయాలి.
– హుసేన్మియా, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా ప్రధానకార్యదర్శి, నంద్యాల
తెలుగు మాధ్యమానికి చంద్రబాబు
సర్కారు మంగళం
నాడు ప్రేమ ఒలకబోసి..
నేడు జీఓ తెచ్చి
బడుల్లో తెలుగు మీడియం లేదంటూ
ఉత్తర్వులిచ్చిన పాఠశాల విద్యాశాఖ
ఇప్పటికే ఇంటర్లో తెలుగు సబ్జెక్టును
ఆప్షనల్ చేసిన వైనం
మండిపడుతున్న భాషాభిమానులు

సర్వం మార్చి.. మంగళం పాడి

సర్వం మార్చి.. మంగళం పాడి