నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3 బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి గురువారం విడుదల చేశారు. పీజీ 4వ సెమిస్టర్లో మొత్తం 1265 మంది విద్యార్థులకు 967 మంది, (76.44శాతం), బ్యాక్లాగ్లో మొదటి సెమిస్టర్లో 427 మంది విద్యార్థులకు 158 మంది (37శాతం), 2వ సెమిస్టర్లో 382 మందికి 65 మంది (17.02శాతం), 3వ సెమిస్టర్లో 34 మంది విద్యార్థులకు 168 మంది (48.84శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు సీఈఓ జి.ఉపేందర్రెడ్డి తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను ఎంజీయూ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారులు డి.సంధ్యారాణి, కళ్యాణి, ప్రవళిక పాల్గొన్నారు.
అమృత్ భారత్ పనుల్లో వేగం పెంచాలి
మిర్యాలగూడ అర్బన్ : అమృత్ భారత్ నిదులతో రైల్వేస్టేషన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణ అన్నారు. గురువారం మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండవ ఫ్లాట్ఫారంపై ఉన్న సిగ్నల్ ఫొటోలు పని చేయకపోవడంతో తక్షణమే వాటిని మరమ్మతు చేయించాలని ఆదేశించారు. గూడ్స్ షెడ్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని అవసరమైతే అదనపు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నడికుడి – బీబీనగర్ రెండు లేన్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.


