శాలిగౌరారం : సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా ధాన్యం లారీల్లోని బస్తాలను దిగుమతి చేస్తున్నారంటూ శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డు గోడౌన్ వద్ద శనివారం ధాన్యం లారీల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. గోడౌన్ వద్ద లారీలను అడ్డుగాపెట్టడంతో ధాన్యం దిగుమతులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గోడౌన్ వద్దకు చేరుకొని లారీ డ్రైవర్లు, హమాలీలతో మాట్లాడారు. నకిరేకల్ డీటీసీఎస్ జ్యోతి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టారీతిన ధాన్యం దిగుమతులు చేయడంతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని పలువురు లారీ డ్రైవర్లు తెలిపారు. మార్కెట్యార్డు పరిధిలో 217 మంది హమాలీలు ఉన్నా కేవలం 20 మంది మాత్రమే రావడం ఏమిటని డీటీసీఎస్ ప్రశ్నించారు. ఎండవేడితో పాటు దిగుమతుల డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడం వల్లే ఎవరూ రావడం లేదని హమాలీలు తెలిపారు. లారీలను సీరియల్ ప్రకారం దిగుమతి చేయాలని డీటీసీఎస్ ఆదేశించారు. దాంతో లారీ డ్రైవర్లు ఆందోళన విరమించారు.
శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిలిచిన ధాన్యం దిగుమతులు


