పెద్దఅడిశర్లపల్లి : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లారీల కొరతను తీర్చేందుకు హైవేలపై లారీలను ఆపి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గుడిపల్లి మండలంలోని చిల్కమర్రి వద్ద ఉన్న మిల్లును పరిశీలించారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తక్షణమే తనకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఫౌర సరఫరాల మేనేజర్ రాంపతినాయక్, తహసీల్దార్ జయశ్రీ, పీఏసీఎస్ సీఈఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


