బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జిలు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు ఇన్‌చార్జిలు

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

నల్లగొండ : బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టనున్న డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జి లను నియమించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజవర్గానికి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగార్జునసాగర్‌కు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, మిర్యాలగూడకు మాజీ ఎంపీ లింగయ్యయాదవ్‌, హుజూర్‌నగర్‌కు కంచర్ల కృష్ణారెడ్డి, కోదాడకు తిప్పన విజయసింహారెడ్డి, సూర్యాపేటకు ఇస్లావత్‌ రామచందర్‌నాయక్‌, నల్లగొండకు ఎమ్మెల్సీ ఎంసి.కోటిరెడ్డి, మునుగోడుకు వెంకటనారాయణగౌడ్‌, భువనగిరికి క్యామ మల్లేష్‌, నకిరేకల్‌కు గుజ్జా దీపిక యుగందర్‌రావు, తుంగతుర్తికి ఎలగందుల వెంకటేశ్వర్‌, ఆలేరు నియోజకవర్గానికి బండా నరేందర్‌రెడ్డిని సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలుగా నియమించింది.

నల్లగొండకు

నేడు మంత్రుల రాక

నల్లగొండ : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి కార్యక్రమానికి శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నట్లు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో సమీపంలోని ఎంఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా స్థాయి ప్రజా పాలన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

27 నుంచి పాలిసెట్‌

వెబ్‌ కౌన్సిలింగ్‌

నాగార్జునసాగర్‌ : పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం పాలిసెట్‌–2026 వెబ్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ ఈనెల 27నుంచి ప్రారంభమవుతుందని సాగర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.ఐలయ్య గురువారం తెలిపారు. సాగర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలిసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 27 నుంచి 31వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 9 నుంచి జూన్‌3 వరకు సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌తో పాటు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జూన్‌ 6న సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు అవసరమైన ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌, మూడు సెట్లు జిరాక్స్‌ ప్రతులతో సమయానికి హాజరుకావాలని సూచించారు. పాలిసెట్‌ హాల్‌టికెట్‌, ర్యాంకు కార్డు, ఎస్‌ఎస్‌సీ మెమో, టీసీ, ఆధార్‌కార్డు, ఆదాయం, నివాస ధ్రువీకరణపత్రాలు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ లేదా బోనఫైడ్‌ సర్టిఫికెట్స్‌ తప్పనిసరిగా తీసుకరావాలని పేర్కొన్నారు. స్లాట్‌ బుకింగ్‌ కోసం విద్యార్థులు tgpolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

యాదగిరి క్షేత్రంలో నిత్యారాధనలు

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట క్షేత్రంలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లకు నిత్యారాధనలు సంప్రదాయబద్ధంగా కొనసాగాయి. వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాలభోగం, సహస్ర నామార్చనలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాఢ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement