మిర్యాలగూడ : కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, మిల్లర్లు ప్రైవేట్ ధాన్యానికి ప్రాధాన్యం ఇచ్చి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బి.చంద్రశేఖర్ హెచ్చరించారు. మంగళవారం ఆయన ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి మిర్యాలగూడలోని వాగ్దేవి, మహేశ్వరి రైస్ మిల్లులను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం వచ్చిన ధాన్యం లారీని 12గంటల్లోపు దిగుమతి చేసి తిరిగి కేంద్రాలకు పంపించాలని, అవసరమైతే ఎక్కువ మంది హమాలీలను నియమించుకోవాలన్నారు. డిండి, అవంతీపురం ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహేశ్వరి రైస్ మిల్లుల్లో రైతు వద్ద డబ్బులు తీసుకున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో సంబంధిత రికార్డులను పరిశీలించిన కలెక్టర్ దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని మాడుగులపల్లి తహసీల్దార్ను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 4.10లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా 2.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో ఉందని తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా దించుకోవాలని, అన్లోడింగ్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాంపతి నాయక్, డీఎస్ఓ వెంకటేశం, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


