జిల్లాలోని కిషోర బాలికల తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలకు హెచ్పీవీ టీకాలు వేయించాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలను అందుబాటులో ఉంచాం.
– పుట్ల శ్రీనివాస్,
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి
నల్లగొండ టౌన్ : మహిళలను పట్టి పీడిస్తున్న వివిధ రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ టీకాలు వేయడం ద్వారా మహిళల్లో వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార, ఇతర క్యాన్సర్లను అరికట్టవచ్చు. 14 నుంచి 15 ఏళ్ల వయసు గల కిషోర బాలికలకు ఈ టీకాలు వేస్తారు. జిల్లా వ్యాప్తంగా హైస్కూళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో 20 వేల మంది 14–15 సంవత్సరాల కిషోర బాలికలు నమోదై ఉన్నారు. వారికి హెచ్పీవీ వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమవుతోంది.
ఆస్పత్రుల్లో టీకాలు
జిల్లాకు ఇటీవల 3,600 హెచ్పీవీ వ్యాక్సిన్ యూనిట్లను ప్రభుత్వం సరఫరా చేసింది. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, మర్రిగూడ ఏరియా ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్పీవీ టీకాలను అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున టీకాలను వేసే కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. పరీక్షలు ముగియగానే టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 429 మంది యుక్త వయసు కిషోర బాలికలకు టీకాలు వేశారు. మిగిలిన వారికి టీకాలు వేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది.
మెడికల్ ఆఫీసర్లకు అవగాహన
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లకు, సూపర్వైజర్లకు, ఏజెంట్లకు హెచ్పీవీ టీకాల కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ అవగాహన కల్పించింది. వాస్తవానికి జనవరి మొదటి వారంలోనే హెచ్పీవీ టీకాలను వేయాలని నిర్ణయించినప్పటికి కేంద్రం నుంచి టీకాలు సరఫరా కావడంతో జాప్యం జరిగింది. కేంద్రం పూర్తిస్థాయిలో టీకాలను సరఫరా చేయగానే కిషోర బాలికలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నారు.
ఫ కిశోర బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్
ఫ జిల్లాకు చేరిన 3,600 యూనిట్లు
ఫ టెన్త్ పరీక్షలు ముగియగానే వ్యాక్సినేషన్
ఫ కార్యాచరణ సిద్ధం చేసిన వైద్య ఆరోగ్య శాఖ


