నల్లగొండ, కనగల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందికి గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన కనగల్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. జి.ఎడవల్లి, కురంపల్లి, నల్లగొండ మండలంలోని జీకెఅన్నారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా చోట్ల మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని క్షేత్రస్థాయిలో కలెక్టర్తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్, పౌరసరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ రెవెన్యూ అధికారులందరూ ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్, హమాలీ, ఇతర సౌకర్యాల సమస్య లేకుండా చూస్తామన్నారు. ఎండాకాలం కావడంతో నిర్ధేశిత ధాన్యం తేమ శాతం వస్తుందని.. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అవసరమైతే రాత్రి సమయంలో లైట్లు ఏర్పాటు చేసి కాంటాలు వేయాలన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మిస్తామన్నారు. రూ.450 కోట్లతో ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్గౌడ్, తహసీల్దార్ పద్మ, సర్పంచ్లు మురళీధర్గౌడ్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఫ నల్లగొండ, కనగల్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం


