నల్లగొండ : కలెక్టర్ చంద్రశేఖర్ ఓ చిన్నారికి భరోసాగా నిలిచారు. కనగల్ మండలం జి.చెన్నారం గ్రామానికి చెందిన చంద్రమౌళి కుమార్తె స్వాతిక (10) గతంలో జరిగిన ఓ ప్రమాదంలో ఒక కాలు కోల్పోయింది. తన కుమార్తెకు కృత్రిమ కాలు అమర్చి, తాను ఉపాధి పొందేందుకు మూడు చక్రాల బండి అందించాలని తండ్రి చంద్రమౌళి బుధవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ చిన్నారి స్వాతికకు కృత్రిమ కాలు ఏర్పాటుకు సాయం చేసేందుకు అంగీకరించడంతో పాటు, చంద్రమౌళి జీవనోపాధి కోసం మూడు చక్రాల బండిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిస్సహాయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. స్వాతికకు అవసరమైన వైద్య సహాయం అందించి ఆమె సాధారణ జీవనాన్ని పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
పథకాల అమలులో అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జనగణనలో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఎన్యుమరేషన్ ప్రక్రియను తప్పులు లేకుండా చేయాలన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, వార్డుల వారీగా సెన్సస్ నిర్వహించాలని తెలిపారు. స్లమ్ ప్రాంతాలను వేరు చేసి మ్యాపింగ్ చేయాలని.. ఏవైనా సందేహాలు ఉంటే సీపీఓను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 166 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని.. మిగతా కేంద్రాలను కూడా వెంటనే తెరవాలని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలన్నారు. సాదా బైనామా పై వచ్చిన దరఖాస్తులనువెంటనే పరిష్కరించాలన్నారు. సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్రెడ్డి, సీపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


