ఫ ఐటీ విచారణలో దొరికిన కార్డుదారులు
ఫ 25,129 మంది కార్డులు పొందారని సమాచారం
ఫ వాస్తవాలు తేల్చాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు
నల్లగొండ : ఐటీ చెల్లించేవారు ఆహారభద్రత కార్డులు పొందారు. ప్రభుత్వం రెండు విడతల్లో ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. ఆ సందర్భంలో ఆస్తులు ఎక్కువగా ఉన్న కొందరితోపాటు ఐటీ చెల్లించేవారు కూడా ఆహార భద్రత కార్డులు పొందినట్లు ఐటీ శాఖ తేల్చింది. దీంతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ వాటిని విచారించి వాస్తవాలు తేల్చాలని జిల్లా అధికారులకు ఆదేశాలు పంపగా వారు తహసీల్దార్ల విచారణకు పంపుతున్నారు. జిల్లాలో మొదటి విడత 7,862, రెండో విడతలో 17,267 మంది ఆహార భద్రత కార్డులు పొందారు. వీరిలో కొందరు భూములు ఉండి, ఐటీ చెల్లిస్తున్నారు. ఈ విషయం ఐటీ శాఖ ద్వారా తెలియడంతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ జిల్లాలోని మండలాల వారీగా ఎక్కడెక్కడ ఎంత మంది ఐటీ చెల్లించేవారు కార్డులు పొందారో విచారించాలని డీఎస్ఓను ఆదేశించారు. జిల్లాలో మొత్తం 25,129 మంది ఐటీ చెల్లింపుదారులు కార్డులు పొందారని పంపించారు. ఇందులో అత్యధికంగా మిర్యాలగూడలో 4,226 మంది ఐటీదారులు కార్డులు పొందగా, నల్లగొండలో 3,147 మంది కార్డులు పొందారు. వీటిని విచారించి వాస్తవమని తేలితే కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం
మిర్యాలగూడ : బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను అతడి కుటుంబ సభ్యులు జీవన్దాన్ సంస్థకు దానం చేశారు. వివరాలు.. దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన గౌరు శ్రీనివాస్(58) గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం శ్రీనివాస్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అతడి బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో వాసవీ క్లబ్ వీ104–ఎ రీజియన్, 10 కపుల్స్ క్లబ్ మిర్యాలగూడ వారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను అవయవదానానికి ఒప్పించారు. దీంతో శ్రీనివాస్ కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు తదితర అవయవాలను మంగళవారం జీవన్దాన్ సంస్థకు దానం చేశారు. శ్రీనివాస్ అవయవదానానికి సహకరించిన కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. అనంతరం శ్రీనివాస్ స్వగ్రామం కొండ్రపోల్లో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య జ్యోతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


