రామన్నపేట : తాను ఐఏఎస్ స్థాయికి ఎదగడానికి తెలుగు భాష దోహదపడిందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్ధశాస్త్రం, వాణిజ్యశాస్త్రం మరియు భౌతికశాస్త్రం ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణలు మరియు సమకాలీన పురోగతి’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సెమినార్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చాట్ జీపీటీ, ఏఐ వలన స్వీయ అభ్యసన, విషయ సేకరణ సులభతరమైందని అన్నారు. కొత్త ఆవిష్కరణల వలన పరిపాలనా వ్యవస్థ ప్రజలకు మరింత చేరువైందని పేర్కొన్నారు. విద్య మానవ సంబంధాలను పెంపొందించే విధంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం జాతీయ సెమినార్ల నిర్వహణకు పూనుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఇటిక్యాల పురుషోత్తం సదస్సు సంచికను ఆవిష్కరించి మాట్లాడారు. ఉన్నత విద్య మార్కుల సాధన కోసం కాకుండా సమాజంలో మార్పులు తీసుకురావడానికి, వ్యక్తిత్వ వికాసంతో పాటు ఉపాధిని పెంపొందించడానికి ఉపయోగపడేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. అనంతరం ఇటీవల ఐఏఎస్ హోదా పొందిన ఏనుగు నర్సింహారెడ్డిని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సన్మానించారు. ప్రిన్సిపాల్ రాహత్ ఖానం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు సీహెచ్. కృష్ణారెడ్డి, వివిధ కళాశాలల ప్రతినిధులు బండారు రామకృష్ణ, సురేష్ శ్రీపాద, ఎస్ఏ మాలిక్, వెల్లంకి సర్పంచ్ ఇడెం రాధాశ్రీనివాస్, పూర్వ విద్యార్థి తూడి మురళీధర్, సదస్సు కన్వీనర్ పి. వెంకటేశ్వర్రావు, కోకన్వీనర్లు జి. సునీత, చిన్నబాబు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
ఫ తెలంగాణ భాషా సాంస్కృతిక
శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి


