వేణుగోపాలుడు పెళ్లికొడుకాయెనే..
● గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి కల్యాణానికి భారీగా తరలివచ్చిన భక్తులు
నార్కట్పల్లి : మండల పరిధిలోని గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం మత్స్యగిరిచార్యులు, వెంకటేశ్వరచార్యులు, శుభంశర్మ, అభిషేక్దేవ్శర్మ, ఉషల్దూవేశర్మ తదితరుల ఆధ్వర్యంలో వైభవంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు కార్యక్రమం జరిపించారు. అనంతరం కల్యాణ వేదిక వద్దకు ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు. విశ్వసేనారాధన పూజ తర్వాత కల్యాణతంతు నిర్వహించారు. కల్యాణోత్సవానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ దంపతులు కల్యాణానికి హాజరై తిలకించారు. అర్చకులు వారికి ఆశీర్వచనం చేసి సన్మానించారు. భక్తులు అఽధిక సంఖ్యలో హాజరై కల్యాణం తిలకించారు. తలంబ్రాలను దేవుడికి సమర్పించారు. ఈ కల్యాణంలో దాదాపు 400 మంది దంపతులు పాల్గొన్నారు. సీఐ నాగరాజు పర్యవేక్షణలో ఎస్ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, సర్పంచ్లు మచ్చ జయసుధ, జెరిపోతుల భారత్, పరమేష్, చిరుమర్తి ధర్మయ్య, ప్రవీణ్రెడ్డి, మాజీ సర్పంచ్ గోసుల భద్రాచలం, దార యాదయ్య, రాచకొండ భాస్కర్, రేగట్టే రాంగోపాల్రెడ్డి, వరలక్ష్మి, గణేష్, నర్సిరెడ్డి, కృష్ణయ్య, నాగరాజు, ఈశ్వరయ్య, వేణు పాల్గొన్నారు.


