వేములపల్లి : తాము ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ గరిష్ట మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులోని రైస్ మిల్లు ఎదుట ఆందోళన చేపట్టారు. కొద్ది రోజులుగా క్వింటా ధాన్యాన్ని రూ.2,700 నుంచి రూ.2,600కు కొనుగోలు చేసిన మిల్లర్లు సిండికేట్గా మారి ధరను తగ్గించి రూ.2,500లకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ పీఎన్డీ.ప్రసాద్, వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు రైస్ మిల్లుల వద్దకు వెళ్లి మిల్లర్లతో మాట్లాడి ధాన్యాన్ని రూ.2,600కు తగ్గకుండా కొనుగోలు చేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
పదో తరగతి పరీక్షకు 45 మంది గైర్హాజరు
నల్లగొండ : జిల్లాలో ఏర్పాటు చేసిన 106 పరీక్ష కేంద్రాల్లో గురువారం పదో తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 19,698 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 19,659 మంది పరీక్ష రాయగా 39 మంది గైర్హాజరయ్యారు. అలాగే 103 మంది ప్రైవేటు విద్యార్థులకు 97 మంది పరీక్ష రాయగా ఆరుగురు గైర్హాజరయ్యారని డీఈఓ భిక్షపతి తెలిపారు.


