
అమ్మ పేరుతో మొక్క
విరివిగా మొక్కలు నాటిస్తాం
గుర్రంపోడు : అమ్మ.. మొక్క.. భూమాత.. మూడింటి మధ్య సారుప్యత ఉంటుంది. అమ్మ కుటుంబానికి బాధ్యత వహిస్తే, మొక్కలు పర్యావరణాన్ని కాపాడతాయి. భూమాత జీవ రాశులను, పర్యావరణాన్ని కాపాడుతుంది. ఈ మూడింటికి ముడి పెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. తల్లి పేరుతో మొక్క నాటితే శ్రద్ధ చూపుతారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం చేపట్టింది. పర్యావరణ దినోత్సవమైన జూన్ 5, 2024లో ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ప్రతిఒక్కరూ తల్లి పేరుతో మొక్క నాటాలని విస్త్రృత ప్రచారం చేసి భారీ సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టారు. ఇటీవల ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినుల భాగస్వాములను చేసి, ప్రతి విద్యార్థి తన తల్లితో కలిసి మొక్కను నాటాలని నిర్ధేశించారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థిని తన తల్లితో కలిసి మొక్కను పాఠశాల ఆవరణలోగాని, పరిసరాల్లోగాని నాటి నాటి ఏకో క్లబ్ మిషన్ లైఫ్ అనే పోర్టల్లో ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యాశాఖ విడుదల చేసిన లింక్లో విద్యార్థిని పేరు, తల్లి పేరు, పాఠశాల డైస్ కోడ్ వివరాలు నమోదు చేసి ఫోన్ గ్యాలరీ నుంచి ఫొటోను తీసుకుని అప్లోడ్ చేయగానే వారి పేరిట ఆన్లైన్లోనే ప్రశంసాపత్రం లభిస్తుంది. నాటిన ప్రతి మొక్కకు ప్రశంసాపత్రం లభిస్తుంది. ప్రశంసాపత్రాన్ని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రశంసాపత్రం ఫోన్లో డౌన్లోడ్లోగాని మరెక్కడా కనిపించదు. వెబ్ పోర్టల్కు సంబంధించి లింక్ను కూడా విద్యాశాఖ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేసింది.
మండలానికి 4 వేల మొక్కల చొప్పున
ఒక విద్యార్థిని ఎన్ని మొక్కలైనా, ఎక్కడైనా తల్లితో కలిసిగానీ, పాఠశాలలో అయితే మహిళా టీచర్తో కలిసి గానీ నాటాలి. జిల్లాకు లక్ష మొక్కలు నాటేలా లక్ష్యం నిర్ధేశించగా మండలానికి 4 వేల మొక్కలు నాటి ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలకు 70 ఫొటోలు లక్ష్యం నిర్ధేశించారు. వన మహోత్సవ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తున్నందున ఇందులోనే తల్లిలో కలిసి విద్యార్థిని ఫొటోలు తీయాల్సి ఉంటుంది. నాటిన ప్రతి మొక్కకు విద్యార్థినికి ప్రశంసాపత్రం లభిస్తుండడంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థినులు తమ ఇంటి పరిసరాల్లో మొక్కను నాటి పాఠశాల యూడైస్ కోడ్, ఇతర వివరాలు నమోదు చేసి సొంతంగా అప్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు.
విద్యార్థినులు తమ తల్లితో కలిసి మొక్కలు నాటి ఫొటోలు అప్లోడ్ చేసేలా అన్ని పాఠశాల హెచ్ఎంలకు దిశానిర్ధేశం చేశాం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే అవసరాన్ని వివరించి విరివిగా మొక్కలు నాటిస్తాం. గ్రామస్థాయిలో వన నర్సరీల నుంచి మొక్కలు పొంది నాటాలని సూచిస్తున్నాం. పాఠశాలలో సరిపడా స్థలం లేని చోట విద్యార్థిని ఇంటి వద్దగాని, పరిసరాల్లో గాని మొక్కను నాటి సంరక్షించాలని వివరిస్తున్నాం.
–నోముల యాదగిరి,
గుర్రంపోడు మండల విద్యాధికారి
ఫ నాటిన ప్రతి విద్యార్థినికి
ప్రశంసాపత్రం
ఫ మొక్కల పెంపకంలో భాగస్వామ్యం
ఫ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేంద్ర ప్రభుత్వం