
కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా సంపత్కుమార్
నల్లగొండ :
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ ఇన్చార్జిగా.. ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ నియామకం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జిలను నియమించింది. ఈ మేరకు పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఏఐసీసీ సెక్రటరీ ఎస్.సంపత్కుమార్ నియమితులయ్యారు.
పోలీస్ గ్రీవెన్స్లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ 68 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని పూర్తి వివరాలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు.
‘యూత్ ఫర్ సేవ’తో
ఎన్జీ కళాశాల ఒప్పందం
రామగిరి(నల్లగొండ) : పట్టణంలోని ఎన్జీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం యూత్ ఫర్ సేవ సోమవారం అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రయోజనానికి ఫిజిక్స్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయో సైన్స్, సోషల్ సైన్స్ అంశాలపై పోస్టర్లు తయారు చేశారు. పోస్టర్లను నల్లగొండలోని ప్రభుత్వ పాఠశాలలకు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, యూత్ ఫర్ సేవా డిస్ట్రిక్ కోఆర్డినేటర్ స్వామి, భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, అధ్యాపకులు ఎం.వెంకట్రెడ్డి, డాక్టర్ వేముల వెంకటేశంతదితరులు పాల్గొన్నారు.
టీబీ నిర్మూలనకు
సమష్టి కృషి
నల్లగొండ టౌన్ : టీబీ నిర్మూలన కోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమష్టిగా కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ కోరారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా బీబీ నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలపై సంబంధిత సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీబీ పరీక్షలను చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, పద్మ, అరుంధతి తదితరులు పాల్గొన్నారు.
జూనియర్ కళాశాలల సందర్శన
తిప్పర్తి, కనగల్ : తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారి భీమ్సింగ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయా చోట్ల రికార్డులను పరిశీలించి మాట్లాడారు. కళాశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సమ యం కేటాయించాలని సూచించారు. క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.10 వేలు కేటాయిస్తామన్నారు. ఆయన వెంట డీఐఈఓ దస్రునాయక్ తదితరులు ఉన్నారు.