
వానాకాలం సాగుకు ముందస్తు ప్రణాళిక
రసాయనిక ఎరువుల
వాడకం తగ్గించాలి
రైతులకు ముందస్తు వ్యవసాయ ప్రణాళిక చాలా అవసరం. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకున్నప్పుడే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. అవసరం లేకున్నా రసాయనిక ఎరువుల వాడడం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి. విత్తనాలను శాస్త్రవేత్తల సలహాలు సూచనల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. భూగర్భ జలాలను కాపాడుకోవడానికి నీటిని పొదుపుగా వాడుకోవాలి. మెట్ట వరి పైరును సైతం సాగు చేసుకోవచ్చు.
– డాక్టర్ శ్రీనివాసరావు,
కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్
త్రిపురారం : వానాకాలం సీజన్లో వివిధ రకాల పంటల సాగుకు రైతులు ముందస్తుగా ప్రణాళిక ప్రకారం వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన గ్రామాల్లో సైతం రైతు ముంగిటకు శాస్త్రవేత్తలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రైతులకు ఖరీఫ్ సిజన్లో పాటించాల్సిన పద్ధతులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
దుక్కులు దున్నడం అత్యంత కీలకం
దుక్కులు దున్నడం వల్ల తొలకరి వర్షాలకు భూమి నీటిని పీల్చుకొని పొలంలో తేమ శాతం పెగడానికి ఉపయోడపడుతుంది. వాలుకు అడ్డంగా లోతు దుక్కులు దున్నడంతో వర్షపు నీరు వృథా కాకుండా నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. తోటల్లో దుక్కుల వల్ల మొండి జాతి కలుపు మొక్కలు, దుంపలు వేళ్లతో సహా బయటకు వచ్చి పిచ్చి మొక్కల కలుపు నివారణ జరుగుతుంది. నిద్రావస్థలో ఉన్న పలు కీటకాలు నశిస్తాయి. సేంద్రియ ఎరువులైన పశువుల పేడ, వర్మి కంపోస్ట్ను దుక్కుల్లో వేసుకోవచ్చు.
చౌడు నేలలను బాగు చేసుకోవడం
భూగర్భ జలాలను విరివిగా వాడడం వల్ల నీటిలోని క్లోరైడ్తో పొలాలు చౌడు భూములుగా మారుతున్నాయి. భౌసార పరీక్షలను అనుసరించి చౌడు భూములను వ్యవసాయ యోగ్య భూములుగా మార్చేందుకు వేసవి కాలం అనువైన సమయం. ఎండాకాలంలో నేలపైకి పొంగి ఉన్న ఉప్పు, చౌడు పొరలను తొలగించాలి. నీరు బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. పొలాన్ని చదును చేసి సుమారు 20 నుంచి 25 సెంట్లుగా మడులను విభజించి గట్టు వేయాలి. కారు చౌడు నేలలను ఎండినప్పుడు పలక రాయి వలే గట్టిగా ఏర్పడతాయి. తగినంత నీరు తేమ ఉన్నప్పుడు మొత్తగా ,ఇక్కటి బురద తయారవుతుంది. ఇలాంటి నేలను బాగు చేసుకోవడానికి ఇదే మంచి సమయం.
పొలం గట్లు, పంట కాలువల తయారీ
రైతులు పొలం గట్ల తయారీ, పంట కాలువలపై అత్యంత శ్రద్ధ వహించాలి. వివిద రకాల కలుపు మొక్కలు పొలం గట్ల నుంచి పంటలకు వచ్చి పంటలకు నష్టాన్ని కలిగిస్తాయి. కలుపు మొక్కలైన ఓయ్యారి భామ, మూల మాతంగి, నీరు గోబ్బి, గొగలగరాకు, గొంగలి రాకాశి, తుంగ వంటి మొక్కలు పంటలలో పెరిగి పలు రకాలపై చేడు పరుగులు వ్యాప్తి చెంది చీడపీడల వ్యాప్తికి కారణయావుతాయి. అందువల్ల ముందస్తుగానే పొలం గట్లు, పంట కాలువను శుభ్రం చేసుకొని తయారు చేసుకోవాలి.
విత్తనాల ఎంపిక
రైతులు తమ విత్తనాలను తమ పొలం నుంచి సిద్ధం చేసుకోవచ్చు. తాలు గింజలు, సగం నిండని గింజలు, కలుపు విత్తనాలను వేరు చేసి నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. వరి పరిశోధన స్థానాల నుంచి సేకరించిన విత్తనాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. సర్టిఫైడ్ విత్తనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసిన విత్తనాలను మొలక శాతం పరిశీలించుకొని నారు పోసుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాలకు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి.
పచ్చిరొట్ట పైర్ల సాగు
పంట సాగుకు ముందస్తుగా పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకొని కలియదున్నడం వల్ల నేలలో భూసారం పెంపొందుతుంది. తొలకరి వారాలకు జనుము, జీలుగ, పిల్లిపెసర అలసంద వంటి పలు రకాల పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకొని కలియదున్నుకోవచ్చు. దీంతో ఎకరాకు 20 నుంచి 30 కిలోల యూరియాను ఆదా చేసుకోవచ్చు. పిల్లి పెసర, జనుమును పశువుల మేతగా కూడా వినియోగంచుకోవచ్చు.
భూసార పరీక్షలు
భూమిలో పోషక విలువలు తగ్గిపోయి పంటల్లో సూక్ష్మపోషక లోపాలు కనిపిస్తుంటాయి. పోషకాలను బట్టి పంటలకు అందించే శక్తి, గాలి, నీరు భూమిలోకి చొచ్చుకుని వెళ్లి ఉదజని సూచిక, లవణ పరిమాణం, లభ్య పోషకాలు పంటల దిగుబడిపై ప్రభావ చూపుతాయి. అందువల్ల భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఏడాదికి ఓక్కటి, రెండు పంటలు పండించే భూముల్లోని మట్టిని సేకరించి భూసార పరీక్ష కేంద్రాల్లో అందజేయాలి. వారి సూచనల మేరకు పంటల సాగు చేపట్టి ఎరువుల వాడకం చేపట్టడం ఉత్తమం.

వానాకాలం సాగుకు ముందస్తు ప్రణాళిక