ఇంకా అందని స్కూల్ యూనిఫాం వస్త్రం
● మరో 14 రోజుల్లో బడులు ప్రారంభం
● క్లాత్ ఎప్పుడొస్తుందనే దానిపై
అధికారుల్లో స్పష్టత కరువు
● మొదటిరోజు సివిల్ డ్రెస్లో బడికి వెళ్లక తప్పని వైనం
స్పష్టత కరువు..
ప్రభుత్వం కొన్నేళ్లుగా టెస్కో ద్వారా స్కూల్ యూనిఫాం క్లాత్ను సరఫరా చేయించి.. మహిళా సంఘాల ద్వారా కుట్టించేది. అయితే ఈసారి టెస్కోకు కాకుండా ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే టెస్కో ద్వారానా.. లేక మరేదైనా సంస్థ ద్వారా క్లాత్ పంపిణీ చేయిస్తారా అనే విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులకు సైతం స్పష్టత లేదు. మరో 14 రోజుల్లో పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో క్లాత్ ఎప్పుడు వస్తుందో.. విద్యార్థులకు కొలతలు ఎప్పుడు తీసుకుంటారో.. కుట్టుపని ప్రారంభించేదెప్పుడో.. అనే పలు రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 47వేల మంది విద్యార్థులు..
జిల్లాలో 749 ప్రభుత్వ పాఠశాలల్లో 47,387 మంది విద్యార్థులు ఉండగా.. వీరిలో బాలురు 25,102 మంది, బాలికలు 22,285 మంది ఉన్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫాంలను అందజేస్తుంది. గతేడాది 1 నుంచి 3వ తరగతి వరకు బాలికలకు ఫ్రాక్, 4, 5 తరగతుల వారికి స్కర్ట్, 6 నుంచి 10వ తరగతి వరకు బాలికలకు పంజాబీ డ్రెస్, పైన కోట్, బాలురకు ప్యాంట్, షర్టులు అందించారు. ఈ సారి మాత్రం యూనిఫాం మోడల్స్పై ఇంకా స్పష్టత రాలేదు.
కందనూలు: ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల విద్యార్థులకు పంపిణీ చేసే ఏకరూప దుస్తులపై ఇప్పటికీ స్పష్టత లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే తొలి రోజే విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తూ వస్తున్న విద్యాశాఖ.. మార్చిలోనే జిల్లాల వారీగా అవసరమైన క్లాత్ను సరఫరా చేసేది. వీటిని ఎమ్మార్సీలకు తరలించి.. ఏప్రిల్, మే నెలల్లో మహిళా సంఘాల సభ్యులతో కుట్టించే వారు. ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నేటికీ జిల్లాకు అవసరమైన క్లాత్ అందలేదు. ఫలితంగా విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీలో జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు విద్యార్థుల దుస్తులు కుట్టి, ఉపాధి పొందుదామనుకున్న మహిళా సంఘాల సభ్యులకు ఎదురుచూపులు తప్పడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభానికి కేవలం రెండు వారాల సమయం ఉండగా.. ఇప్పటికీ క్లాత్ చేరకపోవడంతో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.
సమాచారం లేదు..
క్లాత్ ఎప్పుడు వస్తుందనే అంశంపై స్పష్టత లేదు. ఇప్ప టి వరకు మాకు ఎలాంటి సమా చారం రాలే దు. క్లాత్ కోసం ఎదురుచూస్తున్నాం. క్లాత్ రాగానే సమయానికి కుట్టేలా చర్యలు తీసుకుంటాం. – రమేశ్కుమార్, డీఈఓ
●


