అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత నెల 6న అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న పంట కొనుగోళ్లను ప్రారంభించగా.. గోనె సంచులు లేకపోవడంతో 10 రోజుల తర్వాత తూకం వేశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,193 మంది రైతుల నుంచి 1,46,025 బస్తాల మొక్కజొన్న కొనుగోలు చేసి.. 65,657 బస్తాలను మాత్రమే తరలించారు. ఇంకా 80,368 బస్తాలు తరలించాల్సి ఉండగా.. మరో 20 వేల బస్తాల మక్కలు తూకం వేయాల్సి ఉంది. ఇప్పటికే మార్కెట్లో ధాన్యం కుప్పులు పేరుకుపోవడంతో.. స్థలం సరిపోక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న తీసుకొచ్చిన రైతులు సుమారుగా 20 రోజులుగా ట్రాక్టర్లతో మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నారు.


