కోడేరు: నిరంతర పోరాటాలతోనే కర్షక, కార్మిక సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దన్ పర్వతాలు అన్నారు. గురువారం కోడేరు మండలం తీగలపల్లిలో సీపీఎం జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. భూ నిర్వాసితులందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దేశానాయక్, శ్రీనివాసులు, శివవర్మ, తారాసింగ్, మండల కార్యదర్శి రవి, శివశంకర్, వరప్రసాద్, వెంకటయ్య, రాజాపూర్ బిచ్చన్న పాల్గొన్నారు.


