నాగర్కర్నూల్ క్రైం: ఈ నెల 10న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా అగ్ర నాయకత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని వివరించారు. ఇందులో భాగంగానే చేపడుతున్న ప్రధాని బహిరంగ సభకు జిల్లా నుంచి 125 బస్సుల్లో కార్యకర్తలు తరలిరానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రగౌడ్, నాయకులు తిరపతయ్య, చంద్రకళ, చందు పాల్గొన్నారు.


