● రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్
డాక్టర్ రాంప్రసాద్
● 100 మంది విద్యార్థులకు సైకిళ్లు, 60 మందికి కుట్టుమిషన్ల పంపిణీ
ఏటూరునాగారం: మహిళా సాధికారతే లక్ష్యమని రోటరీ క్లబ్ హనుమకొండ గవర్నర్ డాక్టర్ రాంప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం 100మంది పేద విద్యార్థులకు సైకిళ్లు, 60 మంది మహిళలకు కుట్టు మిషన్లను స్థానిక సర్పంచ్ కాకులమర్రి శ్రీలత, క్లబ్ సభ్యులు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు, ప్రదీప్రావు, ప్రవీణ్రావులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రాంప్రసాద్ మాట్లాడుతూ మహిళలకు కుట్టు మిషన్లను ఇవ్వడం ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తారని తెలిపారు. ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఈ ప్రాంత అభివృద్ధికి మరింత సహకరించాలని అనిపిస్తుందని తెలిపారు. అందుకోసం జెడ్పీహెచ్ఎస్లో చదువుతున్న విద్యార్థుల కోసం సొంత ఖర్చులతో 25 కంప్యూటర్లను కొనుగోలు చేసి వారంలో అందజేస్తానని తెలిపారు. అనంతరం రోటరీ క్లబ్ సభ్యులు లక్ష్మీనర్సింహరావు మాట్లాడుతూ క్లబ్ సభ్యులతో మాట్లాడి వంద సైకిళ్లను తమవంతు సహకారంగా విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు దూరబారం వల్ల బడికి రావడం మానేశారని విషయం తెలుసుకుని క్లబ్ సభ్యులతో మాట్లాడి సైకిళ్లను విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో మరో వెయ్యి సైకిళ్లను కూడా అందిస్తామని హామీనిచ్చారు. అనంతరం కంటి వైద్య నిపుణులు శరత్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం లక్ష రూపాయలతో కంప్యూటర్లను అందించడంతో పాటు స్టడీ మెటీరియల్ సైతం అందజేస్తామన్నారు. అంతేకాకుండా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో శరత్ కంటి ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు కల్యాణ్, లక్ష్మి, బాలకోటిరెడ్డి, శ్యామ్, ప్రభాకర్, నరేశ్, జ్యోతిరెడ్డి, ప్రముఖులు డాక్టర్ వరప్రసాద్, కృష్ణ, అశోక్, రఘు, బోజారావు, ఉప సర్పంచ్ ఎల్లయ్య పాల్గొన్నారు.


