● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి
ములుగు: విద్యార్థులు సాంస్కృతిక కళారంగాల్లో రాణించాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆర్ట్ క్రాఫ్ట్, సాంస్కృతిక దినోత్సవ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ సిద్ధార్థరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సాంస్కృతిక కళలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సాంస్కృతిక రంగాల్లో రాణించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలు ఆర్ట్, క్రాఫ్ట్, సాంస్కృతిక కళల్లో ఆసక్తి కలిగి ఉంటారో వారిని ఆ దిశగా ప్రోత్సహించి ఆయా రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్ధాలని పిలుపునిచ్చారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన మల్లంపల్లి జెడ్పీహెచ్ఎస్, రాజుపేట పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, మేడారం పీఎంశ్రీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, గైడ్ టీచర్లకు డీఈఓ ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు.


