గోదావరి నదిలో డిసిల్టేషన్‌ను రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

గోదావరి నదిలో డిసిల్టేషన్‌ను రద్దు చేయాలి

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

వెంకటాపురం(కె): గోదావరి నదిలో డిసిల్టేషన్‌ను రద్దు చేయాలని అలుబాక, బోదాపురం గిరిజన రైతులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించిన అనంతరం వారు మాట్లాడారు. సీతారాం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ మండలంలోని సగ భూభాగాన్ని ఆక్రమిస్తుందని, ఒకరిద్దరి ప్రయోజనాల కోసం రిపోర్టు తయారు చేసి రైతాంగానికి ఉపాధి లేకుండా చేస్తున్నారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుబ్బంపేట వరకు గోదావరి నదికి కరకట్టకు నిధులు కేటాయించి బ్యాక్‌ వాటర్‌ అంచనా వేసిన ఇంజనీరింగ్‌ అధికారులు ఇసుక మాఫియాకు అమ్ముడుపోయి సంబంధం లేని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోకి తీసుకువచ్చారని ఆరోపించారు. మండలంలో ఇసుక రవాణా కారణంగా రోడ్డు పూర్తిగా ధ్వంసమవడంతో పాటు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయన్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం ఏజెన్సీ ప్రాంతాలను నాశనం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నరసింహచారి, కృష్ణ, వెంకటేశ్వర్లు, రంగయ్య, నారాయణ, రమేశ్‌, ముత్తయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.

రామప్ప దేవాలయాన్ని

సందర్శించిన పర్యాటక గైడ్లు

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని శుక్రవారం గిరిదర్శక్‌ గైడ్లు సందర్శించారు. జిల్లా కేంద్రంలో శిక్షణ పొందుతున్న గిరి దర్శక్‌ పర్యాటక గైడ్లు శిక్షణలో భాగంగా రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీష్‌ శర్మ, ఉమాశంకర్‌ వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత, కాకతీయుల చరిత్ర గురించి టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌కుమార్‌ వారికి వివరించగా రామప్ప శిల్పకళా సంపద బాగుందని కొనియాడారు. అనంతరం వారు పాలంపేట పరిధిలోని కేన్‌ మొక్కలను సందర్శించారు.

ప్రవేశాలకు

దరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి రూరల్‌: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (రామంతాపూర్‌)లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులముల అభివృద్ధి అధికారి ఇందిరా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు ఒక సీటు కేటాయించారని, దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జూన్‌ 1నుంచి 2019 నుంచి మే 1, 2020 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌కు..

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ స్కీం పథకం కింది 1వ తరగతి, 5వ తరగతిలో ప్రవేశం కోసం జూ న్‌ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులముల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 1వ తరగతికి (41) సీట్లు, 5వ తరగతికి (43) సీట్లు కేటాయించినట్లు తెలిపారు.

31వరకు

రెడ్‌ క్రాస్‌ సభ్యత్వ నమోదు

భూపాలపల్లి అర్బన్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు భూపాలపల్లి రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కాశిట్టి శ్రీనివాస్‌ శు క్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా మార్గదర్శకత్వంలో, రాష్ట్ర చైర్మన్‌ దాన కిషోర్‌ నాయకత్వంలో రెడ్‌ క్రాస్‌ సంస్థ సేవలు అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్‌ రా హుల్‌ శర్మ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement