గోవిందరావుపేట: యువత మద్యం మత్తు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని పస్రా ఎస్సై తాజుద్దీన్ అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ క్రీడలు బుధవారం ముగిశాయి. పోటీల్లో రంగాపురం జట్టు ప్రథమ స్థానం సాధించగా, ఇప్పలగడ్డ జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఫ్రూట్ఫాం, గోవిందరావుపేట జట్లు కన్సోలేషన్ బహుమతులు పొందాయి. ఈ సందర్భంగా విజేత జట్లకు ఎస్సై తాజుద్దీన్ బహుమతులు, మెమెంటోలు అందజేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదినారయణ, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ మండలస్థాయి క్రీడోత్సవాలు బుధవారం ముగిసినట్లు ఎస్సై చల్ల రాజు తెలిపారు. క్రీడోత్సవాలలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి 14 జట్లు పాల్గొనగా బుర్గుపేటకు ప్రథమ బహుమతి, వెంకటాపూర్కు ద్వితీయ బహుమతి వచ్చినట్లు తెలిపారు. గెలుపొందిన జట్లకు షీల్డ్లతో పాటు మెమెంటోలు అందించినట్లు ఎస్సై వెల్లడించారు.


