గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఘాట్లు
మంగపేట: వచ్చే ఏడాది జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాలకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఘాట్లతో పాటు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ మహేందర్జీ తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని రైతువేదికలో అదనపు కలెక్టర్ చీమలపాటి మహేందర్జీ(రెవెన్యూ) వివిధ శాఖల అధికారులు, స్థానికులతో సమీక్షాసమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015లో మండల కేంద్రంలోని పొదుమూరు సమీపంలో రూ.5.64 కోట్లతో 170 మీటర్ల మేర నిర్మించిన పుష్కరఘాట్ గోదావరి వరదల కారణంగా ధ్వంసమైందన్నారు. ఘాట్ వరకు ఏర్పాటు చేసిన బీటీ రోడ్డుతో పాటు భక్తులకు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ పైపులైన్, సిస్టర్న్లు గోదావరిలో కలిసిపోయాయన్నారు. గోదావరి వరదల కారణంగా దెబ్బతినకుండా ఘాట్ను నిర్మించేందుకు ఇటీవల ఇరిగేషన్ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించారన్నారు. దీనిపై అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇరిగేషన్ ఈఈ శంకరయ్య ఇటీవల గోదావరి తీరం వెంట పరిశీలించగా మార్కెట్ గోడౌన్ సమీపంలోని దొంగల ఒర్రె వద్ద ఘాట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని గుర్తించారని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు చెప్పినట్లుగా ఘాట్ నిర్మిస్తే గోదావరి వరదలతో మంగపేటకు ముప్పు ఏర్పడుతుందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం గోదావరి వరకు రోడ్డు ఉన్న చోటనే ఘాట్ నిర్మిస్తే బాగుంటుందని, పుష్కరాలకు వచ్చే భక్తులు ముందుగా దర్శించుకునేందుకు శివాలయం సైతం ఉందని వివరించారు. ఘట్వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తే మండల కేంద్రం అభివృద్ధి చెందడంతో పాటు గ్రామస్తులు, వ్యాపారులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అదే విధంగా మల్లూరులో శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం, శంభులింగేశ్వరస్వామి, రామాలయంతో పాటు తదితర ఆలయాలు ఉన్నాయని వివరించారు. అధికారులు పరిశీలించి మల్లూరులో సైతం పుష్కరఘాట్ ఏర్పాటు చేయాలని వివరించారు. అదేవిధంగా రాజుపేట, బూర్గుంపాడులో పుష్కరఘాట్లు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు అదనపు కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. ప్రముఖుల అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వానికి, సంబంధిత ఉన్నతాధికారులకు నివేదికలను పంపిస్తామని అదనపు కలెక్టర్ మహేందర్జీ తెలిపారు. అనంతరం ఆయన ధ్వంసమైన పుష్కరఘాట్తో పాటు నూతన పుష్కరఘాట్ల ప్రతిపాదిత గోదావరి ఒడ్డు ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ రవికుమార్, ఏఈ వలీమ్మహ్మద్ ఆర్డబ్ల్యూఎస్ డీఈ నరేష్బాబు, ఎన్పీడీసీఎల్ డీఈ పురుశోత్తం, ఎంపీడీఓ భద్రు, ఏఓ చేరాలు, ఎస్సై టీవీఆర్ సూరి, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వర్రావు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్జీ
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఘాట్లు


