ఇంటర్నల్ మార్కుల తనిఖీకి 22 టీంలు
ములుగు: జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల తనిఖీకి 22 టీంలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ సిద్ధార్థ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ టీంకు ఒక జీహెచ్ఎం లీడర్గా, లాంగ్వేజ్ టీచర్, నాన్ లాంగ్వేజ్ టీచర్ సభ్యులుగా ఉంటారని వివరించారు. జిల్లాలోని 9 మండలాల పరిధిలో 102 స్కూళ్లలో పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ఈ సభ్యులు సరిచూస్తారని వెల్లడించారు. ఫిబ్రవరి 19 నుంచి 21వ తేదీ వరకు తనిఖీలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఖచ్చితమైన మార్కులు ఆన్లైన్లో ఆప్లోడ్ చేస్తారని వివరించారు. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 80 మార్కులకు పరీక్ష రాస్తే మిగిలిన 20 మార్కులకు ఇంటర్నల్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రాజెక్టు వర్క్, ల్యాబ్ యాక్టివిటీ, ఎఫ్ఏ 1,2,3,4 లలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్నల్ మార్కులు వేశారో లేదో బృందాలు క్షుణ్ణంగా పరిశీలించి మార్కులను సరిచూసుకోవాలని డీఈఓ ఆదేశించారు.
గోవిందరావుపేట: విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి వీరేంద్ర అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ రాంపాక ఐలయ్య ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు వీడ్కోల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరేంద్ర హాజరుకాగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలు సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే విద్య ఒక్కటే మార్గమని సూచించారు. విద్యతోనే పెనుమార్పులు సాధ్యమని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి.ఆశోక్, గోవిందరావుపేట, నార్లాపూర్, చల్వాయి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


