
అమ్మకానికి దొడ్డు బియ్యం
ఈ–వేలం ద్వారా అమ్మకాలు
జిల్లాలో మిగిలిన
18,087 క్వింటాళ్ల బియ్యం
వారం రోజుల్లో టెండర్లు
వెంకటాపురం(ఎం): జిల్లాలో మిగిలిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం ఈ–వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. జిల్లాలోని గోదాములు, మండల లెవల్ స్టాక్ పాయింట్లు (ఎంఎల్ఎస్), రేషన్ దుకాణాల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని వేలం వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 18,087 క్వింటాళ్ల దొడ్డు బియ్యాన్ని వేలం వేసేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతోంది.
ఆరు నెలల తర్వాత..
ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పథకాన్ని ఈ ఏడాది మార్చి 30న ప్రారంభించింది. జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి 222 రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యాన్ని అందిస్తోంది. అయితే అప్పటి వరకే జిల్లాలోని పలు రేషన్ షాపులతోపాటు గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లలో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం వర్షాకాలం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రేషన్ కోసం పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ను జూన్ నెలలోనే పంపిణీ చేసింది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాములన్నీ మూసే ఉన్నాయి. అప్పటికే రేషన్ షాపులు, గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దొడ్డు బియ్యానికి పురుగులు
గత ఆరునెలలుగా రేషన్ షాపుల్లో ఉన్న బియ్యంతో పాటు ఎంఎల్ఎస్, గోదాముల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యానికి పురుగులు పట్టి పాడైపోతున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ నెలలో రేషన్ షాపులు మళ్లీ తెరిచి సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తోంది. అయితే సన్న బియ్యం, దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో ఒకేచోట నిల్వ చేస్తుండడంతో దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు సన్న బియ్యానికి పడుతున్నాయని డీలర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ ఉండటంతో ప్రస్తుతం వచ్చే సన్నబియ్యం నిల్వచేసే స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని, రేషన్ షాపుల నుంచి దొడ్డు బియ్యాన్ని గోదాములకు తరలించాలని రేషన్ డీలర్లు అధికారులను కోరుతున్నారు.
ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని ఈ–వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కిలోకు రూ.24ల చొప్పున విక్రయించేందుకు సిద్ధం అవుతోంది. జిల్లాలోని 9 మండలాల పరిధిలోని 222 రేషన్ షాపుల్లో 2525.29 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వ ఉన్నాయి. ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం(కె) ఎంఎల్ఎస్ పాయింట్లలో 2114.05 క్వింటాళ్ల దొడ్డు బియ్యం, గోవిందరావుపేట, తాడ్వాయి, అర్షనపల్లి, బనిజిపేట గోదాముల్లో 13,448.22 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 18087.56 క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయించడం ద్వారా భారం తగ్గడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.
ఏప్రిల్ నుంచి సన్నబియ్యం
ఇస్తున్న ప్రభుత్వం
రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యానికి పురుగులు
విక్రయించి భారం తగ్గించుకునేలా ప్రభుత్వం చర్యలు
జిల్లాలో మిగిలిన దొడ్డు బియ్యానికి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల్లోగా టెండర్ పిలిచి ఎక్కువ ధర కోట్ చేసిన వారికి బియ్యాన్ని కేటాయించనున్నాం. జిల్లాలో నిల్వ ఉన్న 18,087.56 క్వింటాళ్ల దొడ్డు బియ్యాన్ని ఈ–వేలం ద్వారా విక్రయించనున్నాం.
– మహేందర్ జీ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)

అమ్మకానికి దొడ్డు బియ్యం