
శాంతించిన గోదావరి
కన్నాయిగూడెం: మూడు రోజుల నుంచి ఉరకలేసిన గోదావరి ఉధృతి ఆదివారం కొంతమేర తగ్గి శాంతించింది. మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఆదివారం సాయంత్రం వరకు 8,17,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు 8,57,190 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా ఆదివారం 40 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం తగ్గి శాంతించింది. ప్రస్తుతం బ్యారేజీ 59 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 82.90 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇన్టెక్వెల్ వద్ద ఫేజ్.2 లో ఒక మోటారును ఆన్ చేసి 247 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు.
ఇంకా నీటిలోనే రహదారులు
వాజేడు: మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ తగ్గుతూ వస్తోంది. మూడు రోజుల క్రితం ముంపునకు గురైన రహదారులు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ఇలానే తగ్గుముఖం పడితే కొన్నిచోట్ల రహదారులు బయటపడే అవకాశం ఉంది. టేకులగూడెం చివరన 163 నంబర్ జాతీయ రహదారి ముంపునకు గురికావడంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు– గుమ్మడిదొడ్డి, ఏడ్జెర్లపల్లి– పూసూరు, పేరూరు–కృష్ణాపురం గ్రామాల మధ్యన రహదారులు ముంపులోనే ఉండడంతో ఆయా గ్రామాలకు ఇంకా రాకపోకలు కొనసాగడం లేదు. జాతీయ రహదారి నుంచి కోయవీరాపురం గ్రామానికి వెళ్లే రహదారి చాకలి వాగు వద్ద మునగడంతో గ్రామస్తులు గుట్ట పక్కన ఉన్న పాత దారి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 8,17,183 క్యూసెక్కుల నీటి ప్రవాహం
59 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

శాంతించిన గోదావరి