2నుంచి కోటంచ బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

Feb 26 2023 10:10 AM | Updated on Feb 27 2023 6:45 PM

టేకుమట్ల(రేగొండ): రేగొండ మండలంలోని కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మార్చి రెండు నుంచి కొనసాగనున్న బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం కోటంచలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో 24గంటలు నిరంతరం విద్యుత్‌ను అందించాలని.. అఽధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. భక్తులకు నీటిసౌకర్యాన్ని కల్పించి, నిరంతరం నీటిట్యాంకులను పర్యవేక్షించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. జాతరలో అవాంతరాలు చోటుచేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బందిని, 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. జాతరకు వచ్చే రోడ్లలో ఇబ్బందులు తలెత్తకుండా పీఆర్‌ అధికారులను ఆదేశించారు. ములుగు, భూపాలపల్లి, పరకాల, టేకుమట్ల నుంచి భక్తుల కోసం ఎక్కువగా బస్సులను కల్పించి రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పరకాల, భూపాలపల్లి ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఫైరింజన్‌ను అందుబాటులో ఉంచాలని చెప్పారు.
ప్రత్యేక పూలతో అలంకరణ..
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరించి ముస్తాబు చేయాలని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు నూతన అనుభూతి కలిగేలా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక నిధులను కేటాయించాలని సూచించారు. బ్రహ్మోత్సవాలను పండుగగా జరుపాలని చెప్పారు. అనంతరం జాతర వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాములు, ఆర్డీఓ శ్రీనివాస్‌, డీపీఓ ఆశాలత, డీఎంహెచ్‌ఓ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కొమురయ్య, ఆలయ చైర్మన్‌ మాదాడి అనితకరుణాకర్‌రెడ్డి, ఈఓ బిల్ల శ్రీనివాస్‌, ఎంపీపీ పున్నం లక్ష్మీ, జెడ్పీటీసీ సాయిని విజయ, మండల ప్రత్యేకాధికారి శామ్యూల్‌, తహసీల్దారు షరీఫ్‌ మొహినోద్దీన్‌, ఎంపీడీఓ సురేందర్‌, ఎంపీఓ రాంప్రసాద్‌రావు, సర్పంచ్‌ పబ్బ శ్రీనివాస్‌, ఎంపీటీసీ ఎర్రబెల్లి రవీందర్‌రావు, ఆలయ కమిటీ సభ్యులు పోగు సుమన్‌ పాల్గొన్నారు.

అధికారులు సమష్టిగా పనిచేయాలి

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement