2017లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి నుంచి ఇప్పటివరకు 7 సినిమాలు చేస్తే అందులో మూడు రీమేక్లే. కానీ చిరుపై రీమేక్ హీరో ముద్ర చాలా గట్టిగా పడిపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్'కి బదులు ఓ రీమేక్ చేస్తారనే రూమర్స్ వచ్చాయి గానీ దాన్ని పక్కనబెట్టేశారు. ప్రస్తుతానికైతే ఎలాంటి రీమేక్స్ చేయట్లేదు. కానీ మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి.. చిరంజీవి ఇంటికొచ్చి కలవడంతో మళ్లీ రీమేక్ సందేహాలు వచ్చాయి.
(ఇదీ చదవండి: రేంజ్ రోవర్ గిఫ్ట్.. ప్రభాస్లా ఎవరూ చేయరు : ‘బుజ్జిగాడు’ నటి)
'తుడురమ్' సినిమాతో హిట్ కొట్టిన మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి.. హైదరాబాద్ వచ్చి చిరుని కలిశాడు. అయితే ఎక్కడ రీమేక్ రూమర్స్ వస్తాయోనని ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. 'తుడురమ్' రీమేక్ కోసం తాము కలవలేదని చెప్పాడు. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
'ఈ భేటీకి 'తుడురమ్' రీమేక్కి ఎలాంటి సంబంధం లేదు. చిరంజీవి టీమ్ నుంచి స్వయంగా కాల్ వచ్చింది. చిరంజీవి సర్ మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్నారు అని చెప్పడంతో విమానం ఎక్కేసి ఆయన ఇంటికి వచ్చేశా. ఆయనతో సినిమా, నా వ్యక్తిగత జీవితం తదితర విషయాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. నేను తీసిన ప్రతి సినిమాని ఎంతో శ్రద్ధగా చూసి, అందులోని ప్రతి సీన్ గురించి వివరించి చెబుతుంటే నాకే ఆశ్చర్యమేసింది. ఎంతటి సూపర్స్టార్ అయినా సరే సినిమాలని ఇప్పటికీ చిన్నపిల్లల్లా ఆసక్తితో చూస్తూ అదే ఉత్సాహంతో చర్చించడం చిరంజీవిగారి ప్రత్యేకత' అని తరుణ్ మూర్తి రాసుకొచ్చాడు.
ఇది తన జీవితంలోనే అత్యంత మధురమైన, ఉత్సాహభరితమైన సందర్భాల్లో ఒకటని దర్శకుడు తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే చిరంజీవిని ఈ మలయాళ డైరెక్టర్ కలవడం గురించి సోషల్ మీడియాలో అప్పుడే డిస్కషన్స్ మొదలుపెట్టేశారు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ ఉండొచ్చని అనుకుంటున్నారు.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న చిరంజీవి.. తర్వాత శ్రీకాంత్ ఓదెలతో కలిసి పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఎవరితో చేస్తారనేది ప్రస్తుతానికైతే ఫిక్స్ కాలేదు. బహుశా ఆ ఛాన్స్.. మలయాళ డైరెక్టర్ తరుణ్ మూర్తి అందుకుంటాడేమో చూడాలి?
(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


