తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ బాగుండాలంటే పర్సంటేజీ విధానంలో సింగిల్ స్క్రీన్లు రన్ చేయడం తప్పనిసరి అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సింగిల్ స్క్రీన్ల మనుగడకు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతల మద్దతు కావాలని కోరింది. ఈ విషయంలో ఎగ్జిబిటర్స్ అంతా ఓ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. నిర్మాతలందరు అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేయాలని కోరారు. సింగిల్ స్క్రీన్స్పై సవతి ప్రేమ వద్దని అన్నారు.
దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడుతూ..'ఎగ్జిబిటర్స్ బ్రతుకు పోరాటం ఈ పర్సంటేజ్ విధానం. నిర్మాతలందరు అర్థం చేసుకొండి. మాకు సపోర్ట్ చేయండి. తెలుగులో సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయి. ఇప్పుడంతా ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. థియేటర్ను పక్కన పెట్టేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ను కాపాడుకోవాల్సిన అవసరముంది. గవర్నమెంటు జీవో ఇచ్చినా సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్ రేట్లు పెంచం' అని అన్నారు.
ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ..'2008 నుంచి పర్సంటేజ్ కోసం కొట్లాడుతున్నాం. హరిహర వీరమల్లు టైంలో మాట్లాడితే థియేటర్స్ మూసేస్తున్నామని నెగిటివ్ ప్రచారం చేశారు. నిదానంగా అన్నీ ప్రొడక్షన్స్ హౌస్లు పర్సంటేజ్ పద్ధతి వైపే వస్తున్నాయి. అందరూ ఈ విధానానికి వస్తే మేము ధియేటర్స్ నడుపుతాం'అని అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..'నిర్మాతకు ఎగ్జిబిటర్ బిడ్డతో సమానం. చాలా కాలం నుంచి సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. సింగిల్ స్క్రీన్స్ బిర్యానీ అయితే మల్టీప్లెక్స్ ఆవకాయ లాంటిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముగ్గురు కలవాల్సిన అవసరం ఉంది' అని అన్నారు.


