Unlock 5.0: RGV Announced 'CoronaVirus' will be the First Movie Filming in Theaters | థియేటర్‌లో మొదటి సినిమా కరోనా వైరస్, ఆర్జీవీ‌ - Sakshi
Sakshi News home page

థియేటర్‌లో మొదటి సినిమా కరోనా వైరస్: ఆర్జీవీ‌

Oct 1 2020 1:56 PM | Updated on Oct 1 2020 4:25 PM

RGV Announced Coronavirus Is First Film In Theaters After Lockdown - Sakshi

వివాదాస్పద సినిమాలు, వ్యాఖ్యలు చేస్తూ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడూ వార్తలల్లో నిలుస్తారు. ఆయన నేతృత్వంలో ‘కరోనా వైరస్‌’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలోనే ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ పాటిస్తూ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారు. చాలా సాహసంతో కరోనా సమయంలో కూడా పలు చిత్రాలను తీసి.. తన ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ‘ఆర్‌జీవీ వరల్డ్‌ యాప్’ ద్వారా విడుదల చేశారు. అలాగే ‘కరోనా వైరస్’‌ చిత్రాన్ని కూడా ఓటీటీ ప్లాట్‌ ఫామ్ ద్వారా‌ విడుదలవుతుందని ఆర్జీవీ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌-5 నిబంధనల్లో భాగంగా అక్టోబర్‌ 15 తర్వాత థియేటర్లను ప్రారంభించుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ అనంతరం సినిమా హాల్స్‌లో విడుదల కాబోయే మొదటి చిత్రం తమ ‘కరోనా వైరస్‌’ అని వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు.

‘కరోనా వైరస్’‌ మూవీ పోస్టర్‌ను పోస్ట్‌ చేసి.. ‘మొత్తానికి అక్టోబర్‌ 15 నుంచి అన్ని థియేటర్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రకటన నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. లాక్‌డౌన్‌‌ అనంతరం థియేటర్‌లో విడుదలయ్యే సినిమాల్లో తన ‘కరోనా వైరస్‌’ మూవీనే మొదటిది’ అని క్యాప్షన్‌ జత చేశారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యోదంతంపై వర్మ తెరకెక్కించి సినిమా ‘దిశ ఎన్‌కౌంటర్‌’ ట్రైలర్‌ను ఇటీవల విడుదలైంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘కరోనా వైరస్’‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి అగస్త్య మంజు దర్శకత్వం వహించగా, డీఎస్సార్‌ సంగీతం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement