మెగా హీరో రామ్ చరణ్ తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై స్టైలీష్గా కనిపించారు. ఈ క్రమంలోనే వారికి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అందులో తన సినిమాలతో పాటు కుటుంబ విషయాలను పంచుకున్నారు. గతంలో ఇదే మ్యాగజైన్లో జూనియర్ ఎన్టీఆర్ మెరిశారు. తర్వాత ఆ గౌరవాన్ని అందుకున్న నటుడిగా చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.

పిల్లలను స్ట్రాంగ్గా పెంచుతాను
రామ్ చరణ్- ఉపాసన దంపతులకు మొదట క్లింకార జన్మించగా రీసెంట్గా కవలలు (ఒక బాబు, ఒక పాప) కలిగిన విషయం తెలిసిందే.. శివ రామ్ కొణిదెల, అన్వీర దేవి కొణిదెల అని నామకరణం కూడా చేశారు. అయితే, పిల్లల పెంపకంపై చరణ్ ఇలా చెప్పుకొచ్చారు. 'ఇంట్లో పిల్లలు చేసే అల్లరిని చూసి వాళ్లను మరింత ఎంకరేజ్ చేస్తాను. వారి విషయంలో నేను కాస్త రఫ్గానే ఆలోచిస్తాను. పిల్లలను దూకనిస్తాను.. వారు పడిపోయినప్పటికీ మళ్లీ నిలబడేలా చూస్తాను. మట్టిలో ఆటలాడినా.. ఎత్తుపల్లాలు ఎక్కినా నేను అసలు భయపడను. వాళ్లు చిన్నతనం నుంచే ధైర్యంతో పాటు సాహసం నింపుకొని పెరగాలని ఆశిస్తాను. కానీ, వాళ్ల అమ్మ చాలా సున్నితంగా చూసుకుంటుంది. పిల్లల విషయంలో ఎక్కువ కంగారుపడుతుంది. అయితే, వాళ్ల అమ్మ ఎప్పుడైనా తిట్టినప్పుడు క్లీంకార నా దగ్గరకు వచ్చేస్తుంది.' అని తెలిపారు.

నాన్న చెప్పడంతోనే అయ్యప్ప దీక్ష
అయ్యప్ప దీక్ష గురించి కూడా రామ్ చరణ్ పలు విషయాలు పంచుకున్నారు. నాన్న (చిరంజీవి) సూచనతో 17ఏళ్ల వయసులో తొలిసారి అయ్యప్ప దీక్ష ప్రారంభించినట్లు చరణ్ గుర్తుచేసుకున్నారు. తన ఆలోచనలతో పాటు క్రమశిక్షణను అయ్యప్ప దీక్ష పెంచిందని ఆయన అన్నారు. చిరంజీవి వారసత్వంతో పాటు కష్టపడి పనిచేయడం కూడా తాను తీసుకున్నట్లు పేర్కొన్నారు.


